
రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడు అయిన పెరారివాలన్ 31 ఏళ్ల తర్వాత జైలు నుండి విడుదల అయ్యాడు. అతడిని విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడని సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. అప్పుడు పెరారీవాలన్ వయస్సు 19 ఏళ్లు.
అప్పటినుండి జైలులోనే ఉన్న పెరారివాలన్ 2017లో పెరోల్ మొదటిసారి పెరోల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ 2021 మే లో అతడు పెరోల్ పై జైలు నుండి బయటకు వచ్చాడు. అయితే అప్పటినుండి డీఎంకే ప్రభుత్వం అతడి పెరోల్ ను పొడిగిస్తూ వచ్చింది. ఎట్టకేలకు అతడిని రిలీజ్ చేయాలని సుప్రీం ఆదేశించడంతో ఈ కేసులో పెరారివాలన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది.
రాజీవ్ గాంధీ హత్య జరిగిన నుండి నేటి వరకు జరిగిన కేసు పరిణామాలు:
మే 21, 1991 : అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ రాత్రి 10.20 గంటలకు శ్రీ పెరంబుదూర్ లో హత్యకు గురయ్యారు. ధను అనే మహిళ బెల్ట్ బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీతోపాటు 16 మంది అక్కడికక్కడే చనిపోయారు.
మే 22, 1991: కేసు దర్యాప్తు కోసం CB-CID బృందాన్ని ఏర్పాటు చేశారు.
మే 24, 1991: రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు, అప్పటి రాష్ట్రపతి పాలనలో, దర్యాప్తును సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు.
జూన్ 11, 1991: 19 ఏళ్ల ఏజీ పెరారివాలన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.ఈ కేసులో నిందితుల మాదిరిగానే అతడిపై కూడా టాడా చట్టం కింద కేసు నమోదు చేశారు.
మే20, 1992 : సీబీఐ 12మృతులు, ముగ్గురు పరారీ సహా 41 మంది పై చార్జిషీట్ దాఖలు చేసింది.
జనవరి 28,1998 : సుధీర్ఘ విచారణ తర్వాత నళిని, పెరారివాలన్ తో సహా 26మంది నిందితులకు టాడా కోర్టు మరణశిక్ష విధించింది.
మే 11, 1999: మురుగన్, సంతన్, పెరరివాలన్, నళినితో సహా నలుగురి మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణశిక్షపడ్డ మరో 19మంది ఖైదీలను విడుదల చేసింది. టాడా నిబంధనలను కూడా కేసు నుంచి తొలగించింది.
ఏప్రిల్ 2000: రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు సహా సోనియా గాంధీ చేసిన బహిరంగ విజ్ఞప్తి ఆధారంగా అప్పటి తమిళనాడు గవర్నర్ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు.
2001: సంతాన్, మురుగన్, పెరారివాలన్లతో సహా మరో ముగ్గురు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనను సమర్పించారు.
2006: పేరారివాలన్ ఆత్మకథ, యాన్ అప్పీల్ ఫ్రమ్ ది డెత్ రో అతడు అతను బాంబును తయారు చేయడానికి బ్యాటరీని కొనుగోలు చేసినట్లు ఒత్తిడితో ఒప్పుకోవడం ద్వారా అతను కుట్రలో ఎలా చిక్కుకున్నాడో పేర్కొంది.
అగష్టు 11,2011 : 11 ఏళ్ల తర్వాత వారి క్షమాభిక్ష పిటిషన్లను అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరస్కరించారు.
ఆగస్ట్ 2011: సెప్టెంబర్ 9, 2011న ముగ్గురిని ఉరితీయాల్సి ఉండగా, మద్రాసు హైకోర్టు ఉరిశిక్షపై స్టే విధించింది. మరణశిక్షను తగ్గించాలని కోరుతూ అప్పటి సీఎం దివంగత జయలలిత కూడా తీర్మానం చేశారు.
ఫిబ్రవరి 24,2013 : 23ఏళ్ల తర్వాత వారిని ఉరితీయడం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ కే.టీ థామస్ అన్నారు. నిందితులను ఉరితీస్తే ఒక నేరానికి రెండు శిక్షలు విధించినట్లు అవుతందన్నారు.
నవంబర్, 2013: టాడా కస్టడీలో ఉన్న పెరారివాలన్ స్టేట్ మెంట్ ను మార్చినట్లు సీబీఐ మాజీ ఎస్పీ వి.త్యాగరాజన్ వెల్లడించారు. తాను కొనుగోలు చేసిన బ్యాటరీ బాంబు తయారీకి ఉపయోగపడుతుందని పెరారివాలన్ ఎప్పుడూ చెప్పలేదని ఆయన చెప్పారు.
జనవరి 21, 2014 : దోషుల మరణశిక్షను న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
2015: రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం తనను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు గవర్నర్కు పెరారివాలన్ క్షమాభిక్ష పిటిషన్ను సమర్పించారు. అయితే గవర్నర్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆగస్ట్ 2017: తమిళనాడు ప్రభుత్వం పెరారివాలన్కు పెరోల్ మంజూరు చేసింది
సెప్టెంబర్ 6,2018 : పెరారివాలన్ దాఖలు చేసిన రిమిషన్ పిటిషన్పై నిర్ణయం తీసుకునే హక్కు గవర్నర్కు ఉందని కోర్టు తెలిపింది.
సెప్టెంబర్ 9, 2018: అప్పటి సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని తమిళనాడు క్యాబినెట్ మొత్తం ఏడుగురు దోషులను విడుదల చేయాలని సిఫార్సు చేసింది.
జనవరి 2021: రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న క్యాబినెట్ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, అందువల్ల రాష్ట్రపతి ప్రతిస్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు పేర్కొంది
మే 2021 : పెరారివాలన్ పెరోల్ పై బయటకు వచ్చారు. డీఎంకే ప్రభుత్వం అతడి పెరోల్ ను పొడిగిస్తూ వచ్చింది.
మార్చి 9, 2022 : పెరారివాలన్ కు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది
మే 11, 2022: కేసు విచారణను సుప్రీంకోర్టు ముగించింది
మే 18, 2022 : పెరారివాలన్ ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
మరిన్ని వార్తల కోసం
రాజీవ్ హత్య కేసు నిందితుడిని విడుదల చేయండి
ఎండలో కూర్చోబెట్టి విద్యార్థులకు పాఠాలు