బ్యూటిఫికేషన్​ కాలే .. బోటింగ్​ రాలే .. నాలుగేండ్లు గుడుస్తున్నా కదలని పనులు  

బ్యూటిఫికేషన్​ కాలే  .. బోటింగ్​ రాలే .. నాలుగేండ్లు గుడుస్తున్నా కదలని పనులు  
  • రాముని చెరువు డెవలప్​మెంట్​ జరిగేదెన్నడో?
  • అసంపూర్తి పనులతో అవస్థలు పడుతున్న వాకర్స్​
  • బోసిపోతున్న చిల్డ్రన్స్​పార్క్.. అధ్వానంగా ఓపెన్ జిమ్​ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని రాముని చెరువు బ్యూటిఫికేషన్​పనులు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టు సాగుతున్నాయి. డెవలప్​మెంట్ ​వర్క్స్​ స్టార్ట్​చేసి నాలుగేండ్లు గడుస్తున్నా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ఎప్పుడైనా కాసేపు ఉల్లాసంగా గడపడానికి టౌన్​లో ఉన్న ఏకైక స్పాట్​ రాముని చెరువు మాత్రమే. అలాంటి చెరువు అభివృద్ధిపై మున్సిపల్​ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది.

ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం కారణంగా బ్యూటిఫికేషన్ ​పనులు ఆగిపోయాయి. దీనికోసం నాలుగేండ్ల కిందట టీయూఎఫ్​ఐడీసీ నుంచి రూ.3.50 కోట్లు శాంక్షన్​అయ్యాయి. డీపీఆర్, టెండర్లు, పర్మిషన్లు అంటూ రెండు సంవత్సరాలు కాలం గడిపారు. ఎట్టకేలకు 2022 ఏప్రిల్​లో వర్క్​ స్టార్ట్​ చేసినప్పటికీ ఫండ్స్​ కొరత కారణంగా అనుకున్నంత స్పీడ్​గా పనులు జరగడం లేదు. వచ్చే వానకాలంలోపు వర్క్స్​కంప్లీట్​ చేయకుంటే మరో ఏడాది ఎదురుచూపులు తప్పవు.

మత్తడికి గండి కొట్టిన్రు.. 

రాముని చెరువు బ్యూటిఫికేషన్​లో భాగంగా సిల్ట్​తీసేందుకు మున్సిపల్ అధికారులు మూడేండ్ల కిందట మత్తడికి గండికొట్టారు. తర్వాత మరో ఏడాది కాలయాపన చేసి పనులు మొదలుపెట్టారు. కొన్నేండ్ల నుంచి చెరువును పట్టించుకోకపోవడం వల్ల హైటెక్​సిటీ, జాఫర్​నగర్ ​నుంచి వచ్చే మురుగునీరు, సిల్ట్​తో పాటు గుర్రపు డెక్క, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. సిల్ట్​తొలగింపు కోసం మరోసారి మత్తడి గండిని పెద్దగా చేయడంతో చెరువు మొత్తం ఖాళీ అయ్యింది. ఇష్టారీతిన మట్టితీసి ఇటుకబట్టీలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడంతో సిల్ట్​ పనులను ఆపేశారు. ఫలితంగా మూడేండ్లుగా చెరువులో నీళ్లు లేక 
బోసిపోతోంది.

గతంలో చేసిన పనులు వృథా..

రాముని చెరువు అభివృద్ధి కోసం గతంలో సుమారు రూ.80 లక్షల దాక ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2005లో రూ.40 లక్షలతో పార్క్​ డెవలప్ ​చేశారు. కట్టను వెడల్పు చేయడంతో పాటు చెరువు మధ్యలో నుంచి రోడ్డు నిర్మించారు. పలు రకాల మొక్కలు నాటి లైటింగ్​ ఏర్పాటు చేశారు. బోటింగ్​ కోసం మెట్లు నిర్మించారు. కానీ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్క్​ను ప్రారంభించకుండానే ఆనవాళ్లు కోల్పోయింది. చెరువు చెట్టూ కబ్జాలు పెరగడం వల్ల 2017లో అప్పటి కలెక్టర్​ ఆర్​వీ కర్ణన్ ​భూసర్వే చేయించి చుట్టూ కట్ట నిర్మించారు. 

అవస్థలు పడుతున్న వాకర్స్​

అప్పట్లో అది వాకింగ్​ ట్రాక్​గా ఉపయోగపడ్డప్పటికీ క్రమంగా పిచ్చిమొక్కలు పెరగడంతో వాకర్స్​అటువైపు వెళ్లడం లేదు. రోజూ మార్నింగ్, ఈవెనింగ్ వందలాది మంది రాముని చెరువు కట్టపై వాకింగ్​కోసం వచ్చేవారు గుంతల కారణంగా ఇప్పుడు రావడంలేదు. వర్షాకాలంలో అయితే బుదరలోనే వాకింగ్​చేయాల్సి దుస్థితి నెలకొంది. బ్యూటిఫికేషన్​ పనుల్లో ప్రోగ్రెస్ లేకపోవడంతో వాకర్స్​అసోసియేషన్ ఆధ్వర్యంలో పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. అయినా ఫలితం శూన్యం.

ఆగిన చిల్డ్రన్స్ పార్క్ పనులు

చెరువు కింద రూ.80 లక్షలతో చేపట్టిన చిల్డ్రన్స్ పార్క్​ డెవలప్​మెంట్​పనులు కూడా ఆగిపోయాయి. పార్క్​ ముందుభాగంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ​జిమ్​మెయింటెన్స్​ అధ్వానంగా ఉంది. పరికరాలు దొంగలపాలవుతున్నాయి. టూరిజం డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో బోటింగ్​ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు అతీగతీలేదు. ఇప్పటివరకు రూ.2.50 కోట్ల పనులు చేశామని, కానీ బిల్స్​ రావడం లేదని కాంట్రాక్టర్​ చెప్తున్నాడు.