
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు గురువారంనాడు ( సెప్టెంబర్ 28) ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ ను అతిక్రమించి సీఐడీ చీఫ్ సంజయ్ పనిచేస్తున్నారని అమిత్ షాకు టీడీపీ ఫిర్యాదు చేశారు. విచారణ జరపకుండానే చంద్రబాబుపై ఆరోపణలు చేశారన్నారు. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను బహిరంగంగా మీడియాకు చెబుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షాకు ఇచ్చిన వినతిపత్రంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.వైసీపీకి అనుకూలంగా ఏపీ సీఐడీ చీఫ్ పనిచేస్తున్నాడని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ మేరకు రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించారని హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్త మాదిరిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజయ్, సీఎం వైఎస్ జగన్ కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ సీఐడీ చీఫ్ సంజయ్ వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.