
- రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నయ్: మంత్రి ఉత్తమ్
- బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని సివిల్సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో గురువారం వరకు 60.60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022–--23 యాసంగి సీజన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మే 22 నాటికి కేవలం 36.6 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని తెలిపారు. తమ సర్కారు ఈ రోజునాటికి 24 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసిందని చెప్పారు.
చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం” అని వెల్లడించారు. కాంగ్రె ప్రభుత్వ రైతాంగ అనుకూల విధానాలతో వానాకాలం, యాసంగి సీజన్లలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి సాధ్యమైందని పేర్కొన్నారు. అత్యధిక దిగుబడిని దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచినట్టు వివరించారు. తమ పాలనలో రైతులకు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.