
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ ను టీజీతోనే చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను కూడా టీజీతోనే రిజిస్టర్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ లోగో, పేరులో మార్పులు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(టీఎస్ ఆర్టీసీ)ని టీజీఎస్ఆర్టీసీగా మార్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కూడా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కు మార్చి 15వ తేదీ నుంచే టీజీ అమలు చేస్తున్నది. తాజాగా ఆర్టీసీ బస్సులకు సైతం టీజీ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో ఇకపై ఆర్టీసీ బస్సులను కూడా టీజీ సిరీస్తోనే రిజిస్ట్రేషన్ చేయించనున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9,067 ఆర్టీసీ బస్సులు ఉండగా, వాటిలో 90 శాతం బస్సులు ఏపీ సిరీస్తోనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొనుగోలు చేసిన బస్సులను మాత్రం టీఎస్ సిరీస్తో రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా, త్వరలో టీఎస్ఆర్టీసీ లోగోలో కూడా మార్పు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందులో టీఎస్ ఆర్టీసీ స్థానంలో టీజీఎస్ఆర్టీసీ అని ఉంటుందని, లోగో డిజైన్ కూడా కొంత మారే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే నెలాఖరు నాటికి దాదాపు 500 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.