బిజినెస్డెస్క్, వెలుగు: మాస్టర్కార్డ్పై ఆర్బీఐ రిస్ట్రిక్షన్లు విధించడంతో దేశ బ్యాంకింగ్ సిస్టమ్లో కొంత గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి. అమెరికాకు చెందిన ఈ కంపెనీతో దేశంలోని చాలా బ్యాంకులు టై అప్ అయ్యాయి. కొన్ని బ్యాంకులయితే కేవలం మాస్టర్కార్డ్ క్రెడిట్, డెబిట్ కార్డులను మాత్రమే తమ కస్టమర్లకు ఇష్యూ చేస్తున్నాయి. ఇప్పడు కొత్తగా ఎటువంటి కార్డులను ఇష్యూ చేయకూడదంటూ మాస్టర్కార్డ్పై ఆర్బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టింది. ఇప్పటి వరకు మాస్టర్కార్డ్తో కలిసి పనిచేస్తున్న బ్యాంకులు, మరో పేమెంట్ సర్వీసెస్ కంపెనీలు వీసా, రూపేతో టై అప్ అవ్వాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్రాసెస్ అంతా రెండు మూడు రోజుల్లో అయ్యేదికాదు. ముందు బ్యాంకులు, కార్డులను ఇష్యూ చేసే పేమెంట్ కంపెనీల మధ్య ఒప్పందం కుదరాలి. బ్యాక్ ఎండ్లో టెక్నాలజీ డెవలప్ చేయడానికి మరో రెండు–మూడు నెలలు పడుతుంది. ఇలా మాస్టర్కార్డ్ నుంచి ఇతర కంపెనీలకు షిఫ్ట్ కావడానికి బ్యాంకులకు కనీసం ఆరు నెలలయినా పడుతుంది. ఈ లోపు బ్యాంకులకు కొత్త కార్డులపై వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి పెద్ద సంస్థలు మాస్టర్కార్డ్, వీసా, రూపే కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. దీంతో మాస్టర్కార్డ్పై బ్యాన్ ఉన్నప్పటికీ, ఈ బ్యాంకులు ఇతర సంస్థల కార్డులను ఇష్యూ చేయగలుగుతాయి. కానీ, ఆర్బీఎల్, యెస్ బ్యాంక్, సిటీ బ్యాంక్లు కేవలం మాస్టర్కార్డ్పై ఆధారపడుతున్నాయి. మాస్టర్కార్డ్ బ్యాన్ వీటిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఆర్బీఎల్ తన వెబ్సైట్లో మొత్తం42 క్రెడిట్కార్డులను ఆఫర్ చేస్తోంది. ఈ కార్డులన్ని కూడా మాస్టర్కార్డ్తో కలిసి తెచ్చినవే. యెస్ బ్యాంక్ కూడా తన వెబ్సైట్లో ఏడు క్రెడిట్కార్డులను లిస్ట్ చేసింది. ఈ కార్డులన్ని మాస్టర్కార్డ్కి సంబంధించినవే. సిటీ బ్యాంక్ కూడా నాలుగు మాస్టర్కార్డ్ క్రెడిట్కార్డులను ఇష్యూ చేస్తోంది.
మాస్టర్కార్డ్పై బ్యాన్ ఎందుకు?
పేమెంట్ రిలేటెడ్ డేటాను ఇండియాలోనే స్టోర్ చేయాలని అన్ని విదేశీ ఫైనాన్షియల్ కంపెనీలకు 2018 లో ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. ఆరు నెలల్లో ఈ ప్రాసెస్ పూర్తికావాలని పేర్కొంది. అంతేకాకుండా ‘సెర్ట్’ ఆడిటర్లు చేసిన రిపోర్ట్ను కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపి, తమకు పంపాలని ఆదేశించింది. కానీ, మాస్టర్కార్డ్ ఇప్పటి వరకు ఈ రూల్స్ ఫాలో కాలేదు. డేటా స్టోరేజ్కి సంబంధించిన రూల్స్ను కంపెనీ ఫాలో కావడం లేదని ఆర్బీఐ బ్యాన్ సందర్భంగా ప్రకటించింది. కేవలం మాస్టర్కార్డు మాత్రమే కాదు అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కంపెనీలపై కూడా కొత్తగా కార్డులను ఇష్యూ చేయకుండా ఆర్బీఐ బ్యాన్ విధించింది. చివరి రెండు కంపెనీలకు కూడా దేశంలో తక్కువ మార్కెట్ ఉంది. కానీ, మాస్టర్కార్డ్ అలా కాదు. కంపెనీకి ఇండియా అతిపెద్ద మార్కెట్. దేశంలో రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్లను నడుపుతోంది.
ఇప్పటికే ఉన్నవాళ్లపై నో ఎఫెక్ట్..
ఈ నెల 22 నుంచి కొత్తగా ఎటువంటి కార్డులను ఇష్యూ చేయకూడదని మాస్టర్కార్డ్పై ఆర్బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టింది. ప్రస్తుతం మాస్టర్కార్డ్ వాడుతున్న కస్టమర్లపై ఎటువంటి ప్రభావం ఉండదు. దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డు వాడకం పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో 6.2 కోట్ల క్రెడిట్కార్డులు, 90.2 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల వలన 40.4 బిలియన్ డాలర్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఇంత పెద్ద మార్కెట్లో విస్తరించడానికి మాస్టర్కార్డ్ ప్లాన్స్ కూడా వేసుకుంది. 2014–19 మధ్య బిలియన్ డాలర్లను కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. ఇంకో 5 ఏళ్లలో మరో బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టడానికి రెడీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రిస్ట్రిక్షన్లు వచ్చాయి. ఆర్బీఐ నిర్ణయం నిరుత్సాహపరిచిందని. ఈ సమస్యలు పరిష్కారానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తామని కంపెనీ పేర్కొంది.