
- నర్సు సేవలకు గుర్తింపు...రోమ్ నగరపాలక కమిటీకి ఎన్నిక
తోప్పుంపాడి (కొచ్చి): రోమ్ నగర పరిపాలనా కమిటీ సభ్యురాలిగా ఓ భారత సంతతి మహిళ తెరిసా పుథూర్ ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తెరాస ఇటలీ పౌరులు అత్యధికంగా ఉన్న ప్రాంతం నుంచి ఎన్నిక కావడం విశేషం. రోమ్ మున్సిపల్ కమిటీకి ఓ భారతీయ మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. తెరిసా పుథూర్ స్వస్థలం కేరళలోని కోచి. వృత్తి రీత్యా నర్స్. దాదాపు 35 ఏళ్ల క్రితం రోమ్కు వలస వెళ్లి అక్కడే వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందారు.
విధి నిర్వహణలో.. వృత్తి రీత్యా ఆమె ప్రతిభా పాటవాలు ప్రజలకు చేరువ చేసింది. దీంతో గత పదిహేనేళ్లుగా ఆమె అక్కడ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె భర్త వక్కచ్చన్ జార్జ్. కొచ్చికి చెందిన వారు. జార్జ్ -తెరెసా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తెరెసా తన భర్త, పిల్లలు డేనియల్, వెరోనికా తో కలసి ఏటా సెలవుల్లో భారత్ వచ్చి బంధు మిత్రులతో గడుపుతుంటారు.