ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.76,500
ఈ నెల 21న చెల్లిస్తాం: సీఎండీ ఎన్. శ్రీధర్
సంస్థ ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాలకు ఆదేశాలు జారీ
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు రూ. 296 కోట్ల దీపావళి పండుగ బోనస్ ను ఆ సంస్థ ప్రకటించింది. ఈ యేడు ఒక్కో కార్మికుడు గరిష్టంగా రూ.76,500 వరకు దీపావళి బోనస్ అందుకోనున్నారు. కార్మికులకు బోనస్ పైసలను ఈ నెల 21న చెల్లించనున్నట్లు గురువారం సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ వెల్లడించారు. బోనస్ ను కార్మికుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫైనాన్స్, అకౌంట్స్ విభాగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సింగరేణి కార్మికులకు నిరుడు వచ్చిన 30 శాతం లాభాలకు సంబంధించిన బోనస్ రూ.368 కోట్లను దసరా సందర్భంగా పంపిణీ చేశారు. కార్మికుల పనితీరు ఆధారంగా చెల్లించే పీఎల్ఆర్ బోనస్ రూ.296 కోట్లను దీపావళి పండుగకు ముందు చెల్లిస్తున్నామని సీఎండీ తెలిపారు.
లాభాల వాటా, బోనస్ కలిపి సగటున ఒక్కో కార్మికుడు రూ.1.60 లక్షల వరకు పొందుతున్నారు. వీటిని కుటుంబ అవసరాలకు వాడుకోవాలని, సాధ్యమైనంత
వరకు పొదుపు చేసుకోవాలని సీఎండీ సూచించారు. కష్టపడి పని చేసి ప్రొడక్షన్ టార్గెట్ సాధిస్తే బోనస్ లను పెద్ద మొత్తంలో అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.