- కార్డు ఉన్నవాళ్లందరికీ 2 నెలలపాటు ఉచితంగా రేషన్
- ఢిల్లీ సర్కారు సాయం
న్యూఢిల్లీ, వెలుగు: ఒకవైపు కరోనా వ్యాప్తి, మరోవైపు లాక్ డౌన్తో అల్లాడుతున్న పేద ప్రజలను ఆదుకుంటామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. రేషన్ కార్డులు కలిగిన 72 లక్షల కుటుంబాలకు 2 నెలల పాటు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం తెలిపారు. అయితే ఈ 2 నెలల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని భావించొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు నెలకు రూ.5 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ అమౌంట్ నేరుగా వారి అకౌంట్లలో జమచేయనున్నట్లు తెలిపారు. “వైరస్ చైన్ తెంచేందుకు, వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం లాక్ డౌన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. దీంతో చాలా మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందిపడుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. అయితే పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తాం..” అని చెప్పారు.
అన్ని పార్టీలు ముందుకు రావాలె..
“ప్రస్తుతం ఢిల్లీలో చాలా కఠినమైన పరిస్థితి ఉంది. కరోనా సెకండ్వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది. ఇటు లాక్డౌన్ కారణంగా పేదలు ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరుతున్నాం” అని కేజ్రీవాల్ కోరారు. లాక్ డౌన్ కారణంగా ఆటో, రిక్షా డ్రైవర్లపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత లాక్ డౌన్ కాలంలోనూ వీరికి ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పారు. పాజిటివ్ నిర్ధారణ అయిన పేద కుటుంబాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తామన్నారు. కాగా, మూడో దశ వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా సాగుతోందని కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు రాంలీలా మైదాన్లో 500 ఐసీయూ బెడ్ల కొవిడ్ హాస్పిటట్ను యుద్ధ ప్రతిపాదికన నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్తో కలిసి సిసోడియా ఈ సెంటర్లను పరిశీలించారు.