ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు బీజేపీ కుట్ర

ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు బీజేపీ కుట్ర

ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతుల వ్యవహారంపై శివసేన పత్రిక సామ్నాలో ప్రత్యేక కథనం వచ్చింది. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ కుట్ర పన్నుతోందని శివసేన తన పత్రిక సామ్నాలో ఆరోపించింది. హిందుత్వ పేరుతో బీజేపీ శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా చేసిందన్నారు. రాణా దంపతులను వాడుకుని ముంబైలో హింసకు ప్లాన్ చేశారని కథనంలో పేర్కొన్నారు. గతంలో శ్రీరాముడి పేరుతో ప్రమాణం చేస్తున్న చట్టసభ సభ్యులను వ్యతిరేకించిన నవనీత్ రాణా.. హనుమాన్ చాలీసా పఠనంపై వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించిందని అభిప్రాయపడింది. నకిలీ సర్టిఫికెట్ల ద్వారా పోటీ చేసి గెలుపొందారని రాణా దంపతులపైన ఆరోపణలు చేసింది. 

రాణా దంపతులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. హిందుత్వను మర్చిపోయిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం దగ్గర చాలీసా చదువుతామన్న రాణా దంపతుల ప్రకటనలో శనివారంలో ముంబైలో హై డ్రామా నడిచింది.  తమ నివాసం ఎదుట ఆందోళనకు దిగారన్న రాణా దంపతుల ఫిర్యాదుతో.. 13 మంది శివసేన కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. తర్వాత వారు బెయిల్ పై విడుదలయ్యారు. మరో వైపు రాణా దంపతుల బెయిలు దరఖాస్తుపై ఏప్రిల్ 29న విచారణ జరపనుంది కోర్టు.