హీరోయిన్ సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేమ, పెళ్లి గురించి గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. సోమవారం దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్లో గల లింగ భైరవి ఆలయంలో సంప్రదాయబద్దంగా పెళ్లిబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘భూతశుద్ధి వివాహం’ అనే ప్రత్యేక యోగా సంప్రదాయ విధానంలో ఈ పెళ్లి జరిగిందని ఈశా ఫౌండేషన్ ప్రకటించింది. ఇక తిరుపతికి చెందిన రాజ్ కొన్నాళ్లు అమెరికాలో పనిచేసి, సినిమాలపై ఆసక్తితో మిత్రుడు డీకేతో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఫ్లేవర్స్, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ లాంటి సినిమాలను రాజ్, డీకే డైరెక్ట్ చేశారు. వీళ్లు తీసిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్లో సమంత కీలకపాత్ర పోషించారు. రాజ్, సమంత డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ సోమవారం ఇలా పెళ్లితో ఒక్కటయ్యారు. అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 2017లో నాగచైతన్యతో సమంత వివాహం జరగగా, 2021లో ఈ జంట విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు రాజ్ మాజీ భార్య శ్యామలి ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’ అనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్గా మారింది.
