- డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎంచంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బెయిల్ రద్దు పిటిషన్పై డిసెంబర్ 8లోగా రాతపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17ఏ పై తీర్పు వచ్చిన తర్వాత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని చెప్పింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను మంగళవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్రశర్మల డివిజన్ బెంచ్ విచారించింది. ఏపీ సర్కార్ తరఫు సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ అగర్వాల్ అభ్యంతరం తెలిపారు. ఈ షరతులు రెండు వైపులా వర్తింపజేయాలి అని కోరారు. ఇందుకు కౌంటర్గా సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. ‘‘షరతు నిందితుడికి వర్తిస్తుంది.
అది ప్రభుత్వానికి కాదు.. ”అని అన్నారు. విచారణను వాయిదా వేయకుండా నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ కేసు గురించి పబ్లిక్ డొమైన్లో మాట్లాడకుండా చంద్రబాబుకు బెయిల్ షరతును కొనసాగించాలని ఆదేశించింది. అయితే, రాజకీయ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడంపై నిషేధం విధించే ఇతర బెయిల్ షరతును విధించేందుకు బెంచ్ నిరాకరించింది.