ప్రజావాణిలో ఫిర్యాదులను పెండింగ్​లో పెట్టొద్దు : కలెక్టర్​ మనుచౌదరి

ప్రజావాణిలో ఫిర్యాదులను పెండింగ్​లో పెట్టొద్దు : కలెక్టర్​ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్​లో పెట్టొద్దని కలెక్టర్​ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్​లో దరఖాస్తుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు, ఇతర సమస్యలపై 73 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.  అనంతరం దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన సోమారపు సత్తవ్వ తన ఇంటి పక్కన ఇంటి నిర్మాణం చేపడుతున్న కడవేర్గు లక్ష్మీ గణేశ్ దంపతులు సెట్ బ్యాక్​పాటించకుండా తమను ఇబ్బందులకు గురించేస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

అక్కన్నపేట మండల కేంద్రంలో సర్వే నంబర్ 387 లో ప్రభుత్వం 9 మంది మాదిగ కులస్తులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి భూములు కేటాయించిందని ఇప్పటి వరకు హద్దులు చూపించలేదని కలెక్టర్ కు అర్జీని అందజేశారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్​వో నాగరాజమ్మ, డీఆర్డీవో జయదేవ్ ఆర్య  పాల్గొన్నారు.

మెదక్ : ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. మెదక్​కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ భూ సమస్యలకు సంబంధించి 19, పింఛన్లు 3, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 1, ఇతర సమస్యలపై 29 మొత్తం 52 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఏవో యూనస్  పాల్గొన్నారు.

సంగారెడ్డి టౌన్ : ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో  అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురితో కలిసి బాధితుల నుంచి 60 వినతులను స్వీకరించారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.