లంచమిస్తేనే స్టేషన్​ బెయిల్

లంచమిస్తేనే స్టేషన్​ బెయిల్
  • 41ఏ సీఆర్​పీసీని దుర్వినియోగం చేస్తున్న పలువురు పోలీసులు
  •  కేసును బట్టి లంచాలు డిమాండ్.. పది రోజుల్లో ఏసీబీ వలలో ముగ్గురు ఆఫీసర్లు ​ 

మంచిర్యాల, వెలుగు: స్టేషన్‌‌ బెయిల్‌‌ ఇచ్చే అధికారాన్ని కొందరు పోలీస్​ ఆఫీసర్లు దుర్వినియోగం చేస్తున్నారు. కేసును బట్టి వేలు, లక్షల్లో లంచాలు మెక్కుతున్నారు. ఇటీవల రాష్ర్టంలో ముగ్గురు ఎస్సైలు స్టేషన్​ బెయిల్​కు పైసలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. 41ఏ సీఆర్​పీసీ(క్రిమినల్​ ప్రొసీజర్​కోడ్​)సెక్షన్​ను అవకాశంగా తీసుకుని కొందరు ఎస్సైలు, ఎస్ హెచ్ వోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. కేసు తీవ్రతను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా గుంజుతున్నారు. కాదంటే  నాన్​ బెయిలబుల్​ కేసులు ఫైల్​చేసి రిమాండ్​కు పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో నిందితులు ఎంతో కొంత ముట్టజెప్పి బయటకు వస్తున్నారు. రోడ్​ యాక్సిడెంట్లు, భూముల గొడవలు, ఇసుక, బొగ్గు, రేషన్​ బియ్యం అక్రమ రవాణా, వరకట్నం వేధింపులు, ఇతర చిన్న చిన్న కేసుల్లో స్టేషన్​ బెయిల్​కు లంచాలు డిమాండ్​ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినపుడు మాత్రమే విషయం వెలుగులోకి వస్తోంది. 
రూ. వేలు, లక్షల డిమాండ్​
లారీ ఫైనాన్స్​కు సంబంధించిన చీటింగ్​కేసులో కరీంనగర్​జిల్లా బావుపేటకు చెందిన ఇద్దరు నిందితులకు స్టేషన్​ బెయిల్​ఇచ్చేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్​ఎస్సై భాస్కర్​రావు రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. నిందితులు రూ.1.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకుని ఏసీబీ ఆఫీసర్లకు కంప్లైంట్​చేశారు. ఈ మేరకు బుధవారం తన డ్రైవర్​ ద్వారా లంచం తీసుకోగా కరీంనగర్​ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై భాస్కర్​రావుతో పాటు డ్రైవర్​పై కేసు ఫైల్​ చేసి నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. వికారాబాద్​జిల్లా పెద్దేముల్​ఎస్సై చంద్రశేఖర్​ఇసుక ట్రాక్టర్​ కేసులో రూ.60 వేలు డిమాండ్​ చేసి, రూ.50 వేలు తీసుకుంటూఈ నెల 13న ఏసీబీ వలలో చిక్కాడు. వారం కింద జగిత్యాల ఎస్సై శివకృష్ణ వరకట్నం వేధింపుల కేసులో నలుగురు నిందితులకు స్టేషన్​ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.50 వేలు డిమాండ్​ చేశాడు. చివరకు తన డ్రైవర్​ ద్వారా రూ.30 వేలు తీసుకోగా ఏసీబీ ఆఫీసర్లు వలపన్ని పట్టుకున్నారు. ఇదేవిధంగా రాష్ర్టంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో వసూళ్లపర్వం సాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

స్టేషన్​ బెయిల్​ అంటే..
ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న  కేసుల్లో నిందితులను కోర్టులో రిమాండ్​ చేయాల్సిన అవసరం ఉండదు. వీరికి 41ఏ సీఆర్​పీసీ కింద స్టేషన్​ బెయిల్ ​ఇచ్చే అధికారం ఎంక్వైరీ ఆఫీసర్​కు ఉంటుంది. వారి సమాధానం సంతృప్తికరంగా ఉంటే పూచీకత్తుపై స్టేషన్​ బెయిల్ ​శాంక్షన్ ​చేయవచ్చు. తర్వాత కోర్టులో జరిగే ఎంక్వైరీకి నిందితులు హాజరు కావాల్సి ఉంటుంది. నిందితులు దురుద్దేశపూర్వకంగా నేరం చేసినట్టు భావించినా, బెయిల్​పై బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నా,  బాధితులను బెదిరించి కేను తప్పుదోవ పట్టిస్తారని అనుమానించినా స్టేషన్​ బెయిల్​ఇవ్వకుండా రిమాండ్​కు తరలించవచ్చు. ఇది ఎంక్వైరీ ఆఫీసర్​ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. 

చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్రు
41ఏ సీఆర్​పీసీ ప్రకారం స్టేషన్​ బెయిల్​ఇవ్వడం మంచిదే. తీవ్రమైన నేరాల్లో తప్ప చిన్న చిన్న కేసుల్లో నిందితులు కోర్టుల చుట్టూ తిరగడం తప్పుతుంది. నిందితులు నేరుగా కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కోర్టులపై కేసుల భారం తగ్గుతుంది. కానీ కొంతమంది పోలీస్​ ఆఫీసర్లు స్వలాభం కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పోలీస్​శాఖపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి.                                  – బండవరపు జగన్, బార్​ అసోసియేషన్​   మాజీ జనరల్ ​సెక్రటరీ, మంచిర్యాల

అందరికీ ఆపాదించడం తగదు
పోలీసులు చట్టప్రకారమే స్టేషన్​ బెయిల్​మంజూరు చేస్తున్నారు. ఒకరో ఇద్దరో అవినీతికి పాల్పడినంత మాత్రాన అందరికీ ఆపాదించడం తగదు. రామగుండం కమిషనరేట్​ పరిధిలో గత మూడేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు. పోలీస్​ స్టేషన్లలో అవినీతికి తావు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
                                                                                                                                                            – వి.సత్యనారాయణ, రామగుండం పోలీస్​ కమిషనర్​