
- కొత్త ప్రోగ్రామ్ను లాంచ్ చేసిన వీ హబ్
- రామగుండంలో ఆఫీస్ ఏర్పాటు..
- బిజినెస్ ఆలోచన ఉంటే, కలవండి: దీప్తి రావుల
హైదరాబాద్, వెలుగు: వుమెన్ ఎంటర్ప్రెనూర్లకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసిన వీ హబ్, తాజాగా ‘లాంచ్హెర్’ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా వీడియోల ద్వారా రూరల్, టైర్ 2, టైర్ 3 సిటీలలోని వుమెన్ ఎంటర్ప్రెనూర్లను చేరుకోవాలని సంస్థ చూస్తోంది. మొత్తం 20 పార్టులలో ఈ వీడియోలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగులోనే ఈ వీడియోలు ఉంటాయి. వీడియోల ద్వారా ‘బిజినెస్ను ఎలా స్టార్ట్ చేయాలి?’ అనే అంశంపై మహిళలలో అవగాహన కలిపిస్తారు. రూరల్ ఏరియాలలోని మహిళలను కూడా చేరుకోవడానికి ఈ ప్రోగ్రామ్ను తీసుకొచ్చామని వీ హబ్ సీఈఓ దీప్తి రావుల అన్నారు. వుమెన్ ఎంటర్ప్రెనూర్ల కోసం భవిష్యత్లో కూడా అనేక ప్రోగ్రామ్లను లాంచ్ చేస్తామని చెప్పారు. బిజినెస్ ఆలోచన ఉన్న మహిళ ఎవరైనా, వీ హబ్ను కాంటాక్ట్ చేస్తే వారికి సాయం చేస్తామని అన్నారు. థింక్ విజన్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లను ఎలా చేరుకోవాలి, టెక్నాలజీని ఎలా వాడుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. మొత్తం మూడు నెలలు పాటు ఉండే ఈ ప్రోగ్రామ్ ద్వారా, తమ బిజినెస్లను సొంతంగా పెంచుకోగలిగే నాలెడ్జ్ వస్తుందని అన్నారు. రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) తో తాజాగా వీ హబ్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ ప్రకారం, 500 మంది మహిళా వ్యాపారస్తులతో కలిసి ‘ప్రాజెక్ట్ ఇన్క్లూజన్’ ను ఏర్పాటు చేయనున్నారు.
కరోనా టైమ్లోనూ సాయం..
కేవలం అప్పర్ మిడిల్ క్లాస్ మహిళలే కాకుండా, రూరల్, టైర్ 2, టైర్ 3 సిటీల నుంచి కూడా వుమెన్ ఎంటర్ప్రెన్యూర్లు వీ హబ్కు వస్తున్నారని దీప్తి పేర్కొన్నారు. వీ హబ్ 2017 లో స్టార్టయ్యింది. ఇప్పటి వరకు 228 స్టార్టప్లు, ఎంటర్ప్రైజ్లు ఎదగడంలో సాయపడ్డామని వీ హబ్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. స్టార్టప్ల కోసం రూ. 36.2 కోట్లతో ఫండ్ను క్రియేట్ చేశామని, 53 పార్టనర్లతో కలిసి సుమారు 650 స్టార్టప్లకు ప్యత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ అందించామని తెలిపింది.