
- మంత్రులు తుమ్మల, ఉత్తమ్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసి రైతులకు భరోసా కల్పిస్తామన్నారు.
జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలని సభ్యులకు సూచించారు. అనంతరం సూర్యాపేట మార్కెట్లో నూతనంగా 20 షాపులను నిర్మించాలని, రైతుల కోసం మౌలిక వసతులు కల్పించాలని కమిటీ సభ్యులు మంత్రులను కోరారు. సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు వీరన్న నాయక్, తిరుమలరావు, బాలకృష్ణ, వెంకన్న, దామోదర్ రెడ్డి, కేశవులు, నర్సింహాచారి, అబ్దుల్ కరీం, నవీన్ కుమార్, సత్యనారాయణ, సత్తిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.