
- కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సూచనకు రేవంత్ ఓకే
- స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై సీఎంకు అభినందన
- ఐటీఐ సిలబస్ అప్గ్రేడ్కు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి సూచించారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి సీఎం రేవంత్ తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి అభినందించారు.
ఆదివారం జయంత్ చౌదరితో రేవంత్ రెడ్డి తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా, ఐటీఐలన్నింటికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని విన్నవించారు.
కాగా, ఐటీఐల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఐటీఐల్లో సిలబస్ను కాలానుగుణంగా అప్గ్రేడ్ చేయాలని, దీని కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎంవో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం కౌశల్ మందన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హైదరాబాద్ వచ్చారు.