పాస్‌‌‌‌పోర్టు వెరిఫికేషన్‌లో .. మన పోలీసులు దేశంలోనే నంబర్ వన్

పాస్‌‌‌‌పోర్టు వెరిఫికేషన్‌లో .. మన పోలీసులు దేశంలోనే నంబర్ వన్

‘వెరీఫాస్ట్‌‌‌‌’ యాప్‌‌‌‌  సర్వీసెస్‌‌‌‌లో ఉత్తమ సేవా అవార్డుకు ఎంపిక
3 వర్కింగ్ డేస్​లోనే కేసుల పరిష్కారం
పౌరుల నుంచి 95 శాతం సంతృప్తి
నేడు పాస్‌‌‌‌పోర్టు సేవా దివస్‌‌‌‌  సందర్భంగా ఢిల్లీలో అవార్డు అందుకోనున్న ఐబీ చీఫ్

 
హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పాస్‌‌‌‌పోర్టు అప్లికేషన్ల వెరిఫికేషన్‌‌‌‌లో మన రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్ వన్ గా నిలిచారు. వెరిఫికేషన్‌‌‌‌  ప్రక్రియలో వేగంగా, పారదర్శకంగా వినియోగించే  ‘వెరీఫాస్ట్‌‌‌‌’ యాప్‌‌‌‌  సర్వీసెస్‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా ధ్రువీకరణ అవార్డును ప్రకటించింది. పాస్‌‌‌‌పోర్టు సేవా దివస్‌‌‌‌  (ఏటా జూన్ 24న నిర్వహిస్తారు) సందర్భంగా మంగళవారం ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్‌‌‌‌  చేతుల మీదుగా తెలంగాణ ఇంటెలిజెన్స్‌‌‌‌ డీజీ  బి.శివధర్ రెడ్డి ‘ఉత్తమ సేవా ధ్రువీకరణ’ పత్రాన్ని అందుకోనున్నారు. 

పాస్ పోర్టుల జారీ ప్రక్రియలో భాగమైన వెరిఫికేషన్‌‌‌‌  ప్రాసెసింగ్ ను దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో పోలీసులు మూడు రోజుల్లోనే పూర్తిచేస్తున్నారు. ఇంటెలిజెన్స్ డేటా ఆధారంగా మోసపూరిత దరఖాస్తులను, పాత నేరస్తులను గుర్తిస్తున్నారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా దరఖాస్తుల పరిశీలన చేస్తుండడంతో పౌరుల నుంచి సైతం 95 శాతం సంతృప్తి వ్యక్తం అవుతోంది. 

రోజుకు సరాసరిన 2 వేలకు పైగా అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. ఇలా ఏడాదికి సగటున 8 లక్షల అప్లికేషన్లను పరిశీలించి సంబంధిత అధికారులకు నివేదికలు అందిస్తున్నారు. వెరీఫాస్ట్‌‌‌‌ యాప్‌‌‌‌తో అత్యంత వేగంగా పాస్‌‌‌‌పోర్ట్  ధ్రువీకరణను పూర్తిచేస్తూ, మూడు పని రోజుల్లోనే ఎక్కువ శాతం కేసులను పరిష్కరిస్తున్నారు. దీంతో ఫాస్ట్‌‌‌‌  వెరిఫికేషన్ కేటగిరిలో రాష్ట్ర పోలీసులకు ఈ అరుదైన గౌరవం దక్కింది.