4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ : తుమ్మల

4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ : తుమ్మల
  • మరో రూ.1,313.53 కోట్లు విడుదల: తుమ్మల 
  • బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ప్రశ్నించే హక్కు లేదన్న మంత్రి  

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్రంలో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,313.53 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. దీంతో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించి 6.33 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు రైతు భరోసా కోసం మొత్తం రూ.5,215.26 కోట్లను విడుదల చేసి, 58.04 లక్షల మంది రైతులకు సాయం అందించినట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, ఇందులో భాగంగా వరుసగా మూడో రోజు నిధులు విడుదల చేశామన్నారు. ఎకరాల సంఖ్యతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సాయం అందిస్తామని స్పష్టం చేశారు. 

మరో వారంలో రైతులందరికీ రైతు భరోసా నిధుల జమ పూర్తవుతుందన్నారు. కాగా, రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని తుమ్మల అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సందర్భం మినహా, వానాకాలం రైతు బంధు నిధులను సాగు సమయానికి ముందు ఎప్పుడూ అందించలేదని విమర్శించారు. గతంలో ఒక్కసారి కూడా మూడు రోజుల్లో రూ. 5 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవన్నారు. 

రైతు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రూ. 77 వేల కోట్లను రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. రూ. 2 లక్షలలోపు రైతు రుణమాఫీ పూర్తి చేసి, దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. రైతు భరోసా కింద సాయాన్ని ఎకరానికి రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు పెంచామని చెప్పారు. గత ప్రభుత్వం యాసంగి రైతు బంధు నిధులను చెల్లించకపోయినా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని కూడా చెల్లించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, రైతుల కోసం ఎలాంటి పథకాలను ఆపలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మానుకోవాలని, లేకపోతే తెలంగాణ రైతాంగం క్షమించదని హెచ్చరించారు.