- దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కార్తీక దీపోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించాలని, ప్రతి ఆలయాన్ని దీపాలతో అలకరించాలని ఎండోమెంట్ ఉన్నతాధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. కార్తీక దీపోత్సవం వచ్చే నెల19 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎండోమెంట్ ఉన్నతాధికారులు శైలజా రామయ్యర్, హరీశ్, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంటు కమిషనర్లు, ఈవోలతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.
దీనికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల ఈవోలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని, కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం శుభప్రదంగా భావిస్తారని తెలిపారు. ప్రతిరోజు సామూహిక కార్తీక దీపోత్సవం సాయంత్రం 6 గంటల నుంచి జరపాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మట్టి ప్రమిదలు, వత్తులు, నూనెతోపాటుగా పసుపు, కుంకుమ, తాంబూలాలను మహిళా భక్తులకు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. కార్తీక సోమవారం సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రి అందించనున్నట్టు వెల్లడించారు. టూరిజం డిపార్టుమెంట్ సహకారంతో కల్చరల్ప్రోగ్రామ్లు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హరీశ్, అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
