అటు తనిఖీలు ఇటు ఆందోళనలు..తెలంగాణ యూనివర్సిటీలో ఉత్కంఠ

అటు తనిఖీలు  ఇటు ఆందోళనలు..తెలంగాణ యూనివర్సిటీలో ఉత్కంఠ

నిజామాబాద్/డిచ్​పల్లి, వెలుగు : ఒక వైపు విజిలెన్స్​ తనిఖీలు.. మరోవైపు ఔట్​ సోర్సింగ్​ఉద్యోగుల ఆందోళనలతో తెలంగాణ యూనివర్సిటీలో అట్టుడికింది. ఉద్యోగులు వంట పనులు ఆపేసి ఆందోళనకు దిగడంతో స్టూడెంట్లు పస్తులు ఉండాల్సివచ్చింది. లంచ్​ లేకపోవడంతో  స్టూడెంట్స్​అడ్మిన్​ బిల్డింగ్​ ముందు బైఠాయించారు.   మంగళవారం వర్సిటీలో  రెండో దఫా విజిలెన్సు సోదాలు జరిగాయి.  నలుగురు ఆఫీసర్ల టీం కీలక  డిపార్ట్​మెంట్లలో  పలు ఫైల్స్​ స్వాధీనం చేసుకొని హైదరాబాద్​ తీసుకుళ్లారు.   విజిలెన్స్​టీం ఉదయమే వర్సిటీ చేరుకుంది.  అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో  ఆఫీసర్లు ఏఏ అంశాలకు సంబంధించి తనిఖీలు చేయాలో ముందుగానే అనుకుని వచ్చినట్టు తెలుస్తోంది.   

పాలక మండలి ఆమోదం లేకుండా వీసీ రవీందర్​గుప్తా చేసిన అడ్డగోలు ఖర్చులు,  నిబంధనలకు విరుద్ధంగా చేసిన  ఉద్యోగుల  అపాయింట్​మెంట్లపై ​ ఫోకస్​పెట్టారు.   ఆయన కొనుగోలు చేయించిన ఫర్నిచర్​ను ఆర్ట్స్​ కాలేజీకి వెళ్లి చూశారు.  విజిలెన్స్​ అడిగిన ఫైళ్లను  అకౌంట్స్​ ఆఫీసర్​ భాస్కర్​, అసిస్టెంట్​ రిజిస్ట్రార్​ సాయాగౌడ్​అందజేశారు. ఈనెల 6న ఏసీబీ, విజిలెన్స్​ జాయింట్​ సోదాలు చేయగా..  ఈసారి విజిలెన్స్​ వారు మాత్రమే వచ్చారు.  
 
​ రిజిస్ట్రార్​ ఆఫీసుకు లాక్​ 

విజిలెన్సు తనిఖీలు కొనసాగుతున్నంత సేపు రిజిస్ట్రార్​ ఆఫీసుకు తాళం వేసి ఉంది. రిజిస్ట్రార్​గా ఈసీ సభ్యులు నియమించిన యాదగిరి, వీసీ  అపాయింట్ చేసిన   కనకయ్య ఇద్దరూ వర్సిటీకి రాలేదు.   అకౌంట్స్​ ఆఫీసర్​ భాస్కర్​పై  ఆరోపణలు రావడంతో వాటిపైన ఆయనను ఆఫీసర్లు   ప్రశ్నించినట్టు తెలుస్తోంది.    హైదరాబాద్​ నుంచి వర్సిటీకి బయలుదేరిన వీసీ రవీందర్​గుప్తా కు విజిలెన్స్​సోదాల  సమాచారం తెలుసుకుని   భిక్కనూర్​నుంచి వెనక్కి వెళ్లినట్టు  సమాచారం. 

జీతాల ఆందోళన

జీతాలు రాక  అవస్థలుపడుతున్నామని 276 మంది ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు  పనులు మానేసి  ఆందోళనకు దిగారు.  హాస్టల్​లో పనిచేసే  వందమంది కూడా ఆందోళనలో పాల్గొన్నారు. వారంతా ధర్నాలో పాల్గొని.. ఉదయం  టిఫిన్లు కూడా పెట్టలేదు.  మధ్యాహ్నం లంచ్​  కోసం మెస్​కు వెళ్లిన స్టూడెంట్లు  వంటలే చేయలేదని తెలిసి  ఆందోళనకు దిగారు. ఆధికారులపై కోపంతో  తమను పస్తులు ఉంచడంఏమిటని స్టూడెంట్లు నిరసన వ్యక్తం చేశారు.  వంటపనివారిని ఆందోళన విరమించాలని చీఫ్​ వార్డెన్​ మహేందర్​కోరినా వారు వినలేదు.  13 తేదీవచ్చినా జీతాలివ్వకుంటే ఎలా బతుకుతామని, జీతాలిచ్చేదాక ఆందోళన విరమించేదిలేదని  మొండికేశారు.  దాంతో  రాత్రి భోజనాన్ని బయట నుంచి  తెప్పిస్తానని వార్డెన్​ స్టూడెంట్లకు నచ్చచెప్పడంతో  వారు   శాంతించారు.

చెక్​ పవర్​ ఎవరిది ..  

వర్సిటీలో బ్యాంకు నుంచి చెక్కులను  డ్రా చేసే అధికారం   రిజిస్ట్రార్​కే ఉంటుంది.  గత నెలలో రిజిస్ట్రార్ల కూర్చీలాట ఆయోమయానికి కారణమైంది.    ఎవరిని రిజిస్ట్రార్​గా గుర్తించాలని బ్యాంకు అధికారులు   రాష్ట్ర ఉన్నత విద్యామండలికి లెటర్​ రాయగా..  యాదగిరికి పవర్స్​ ఇస్తున్నట్టు  సమాధానం ఇచ్చారు.  దీంతో గతనెల  9 న   జీతాలు చెల్లించారు. ఈనెల కూడా యాదగిరి, కనకయ్యలపై వివాదం కొనసాగింది. జీతాల కోసం  సుమారు రూ.3.25 కోట్లు  బ్యాంకులో జమచేసినా   రిజిస్ట్రార్​ వివాదం వల్ల జీతాల చెల్లింపు జరగలేదు.