- ఇంకో 2,082 ఎకరాలు అమ్మేద్దాం
- రాజీవ్ స్వగృహ ఫ్లాట్లూ వేలం..
- రూ. 7,837 కోట్లు వస్తాయని సర్కారు అంచనా
- లిటిగేషన్ లేని భూములను గుర్తించిన ఆఫీసర్లు
- ప్రభుత్వం వద్దకు ప్రపోజల్స్.. మూడు నెలల్లో సేల్స్ పూర్తి
- మొన్న 65 ఎకరాలు అమ్మితేనే రూ. 2,700 కోట్లు
జులైలో సర్కార్ 65 ఎకరాల భూములను అమ్మేసింది. ఇందులో కోకాపేట, ఖానామెట్ భూములు ఉన్నాయి. కోకాపేట భూములు సగటున ఎకరానికి రూ. 40 కోట్లు, ఖానామెట్ భూములు సగటున రూ. 48 కోట్లకు పైగా ధర పలికాయి. రికార్డు స్థాయిలో ఎకరా ఏకంగా రూ. 60 కోట్ల మార్కును దాటింది. మొత్తంగా 65 ఎకరాల భూముల అమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లకు పైగా వచ్చాయి. అయితే ఇందులో ఖానామెట్ భూములపై కోర్టులో కేసు నడుస్తున్నది.
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూముల అమ్మకాల్లో భాగంగా ఈసారి 2,082 ఎకరాలను వేలం వేసేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. ఇప్పటికే ఆఫీసర్లు.. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)లో ఎంతెంత భూమి అమ్మాలనేది గుర్తించారు. ఎటువంటి లిటిగేషన్లేని ల్యాండ్ వివరాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వచ్చే మూడు నెలల్లో ఫేజ్ల వారీగా 2,082 ఎకరాల భూములను, స్వగృహ ఫ్లాట్లను అమ్మాలని సర్కారు నిర్ణయించింది. వీటి ద్వారా ఏకంగా రూ. 7,837 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. 2021-–22 ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా రూ. 16 వేల కోట్లు సమీకరించుకోవాలని బడ్జెట్లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొన్నామధ్య కోకాపేట, ఖానామెట్లో 65 ఎకరాల అమ్మకంతో రూ. 2,700 కోట్లు రాబట్టుకుంది. లిటిగేషన్ లేని భూములను వీలైనంత త్వరగా అమ్మేయాలని చూస్తున్నది. కోర్టుల నుంచి సమస్య వస్తుందనే ఇటీవల అసెంబ్లీ సెషన్లో హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములన్నీ ప్రభుత్వానికే చెందినవిగా భావించాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు యాక్ట్ 1956కు సవరణలు చేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.
హౌసింగ్ బోర్డు పరిధిలో 386.2 ఎకరాలు
హౌసింగ్ బోర్డు పరిధిలో లిటిగేషన్ లేని భూములు 386.2 ఎకరాలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఎక్కువ భూములున్నాయి. వీటి అమ్మకం ద్వారా రూ. 2,844 కోట్లు వస్తాయని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రపోజల్లో అంచనా వేశారు.
అంటే ఎకరాకు రూ. 7.5 కోట్లు మినిమమ్ రేట్గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వాలు హౌసింగ్ బోర్డు ద్వారా ఇండ్లు కట్టి, అమ్మేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నష్టాల పేరుతో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. ఇండ్ల నిర్మాణాల కోసం బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పులు తెచ్చి, అనుకున్న టైంలో ఆ ఇండ్లను అమ్మకపోవడంతో వడ్డీల చెల్లింపులకు సమస్యలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ భూములను ప్లాట్లుగా చేసి అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అమ్మిన తర్వాత డిమాండ్కు తగ్గట్టు జిల్లాల్లోని హౌసింగ్ బోర్డు భూములను కూడా అమ్మేసే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు.
స్వగృహలో 866 ఎకరాల భూమి, వేలల్లో ఫ్లాట్లు
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న భూములతో పాటు ఇప్పటికే నిర్మించిన ఇండ్ల(ఫ్లాట్స్)ను వేలం పాటలో అమ్మేయనున్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో 866 ఎకరాలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో 90 శాతం భూములు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఈ 866 ఎకరాల భూములను అమ్మడం ద్వారా రూ. 1,212 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు నాలుగు ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు ఉండగా.. ఇందులో నాగోల్– బండ్లగూడలో 2,244 ఫ్లాట్లు, పోచారంలో 1,500 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ రెండు చోట్ల దాదాపు నిర్మాణాలు పూర్తి కాగా, ఫినిషింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. జవహర్నగర్, గాజులరామారంలో 6,215 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ చాలా వరకు పనులు మిగిలిపోయాయి. మరికొన్ని ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ అమ్మడం ద్వారా రూ. 1,612 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. మొత్తంగా రూ. 2,824 కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం చూస్తున్నది.
'దిల్' భూములు 829 ఎకరాలు
దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్(దిల్) కు సంబంధించి 829.4 ఎకరాల భూములు అమ్మాలని నిర్ణయించారు. ఈ భూములు హయత్నగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కోహెడ, మొయినాబాద్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర ప్రాంతాల్లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాల, తుమ్మలూరు తదితర చోట్ల మరికొంత భూమి ఉంది. అయితే దిల్ భూములతో వచ్చే ఆదాయాన్ని తక్కువగానే సర్కార్ అంచనా వేస్తోంది. ఎకరం రూ. 2.5 కోట్లు మినిమమ్ ధరగా అనుకుని, 829 ఎకరాలకు రూ. 2,169 కోట్లు వస్తాయని భావిస్తోంది.