ఈ వ్యర్థాలపై క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ ఉద్యమం

ఈ వ్యర్థాలపై క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ ఉద్యమం
  • 110 నగరాలు, 300 పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు
  • 5500 మెట్రిక్ టన్నుల ఈ –వ్యర్థాల సేకరించాలని లక్ష్యం

నిజామాబాద్: సమగ్రమైన రివర్స్ లాజిస్టిక్స్‌ పరిష్కారాలను అందించడంలో  అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న రివర్శ్‌ లాజిస్టిక్స్‌ గ్రూప్‌ (ఆర్‌ఎల్‌జీ) ‘క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించింది. భావి తరాలకు గొడ్డలిపెట్టులా మారి భౌగోళిక వాతావరణాన్ని నాశనం చేస్తున్న ఈ-వ్యర్థాల గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఊరూరా తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ  ప్రతిష్టాత్మక ప్రచారం క్లీన్‌ టు గ్రీన్‌ (సీ2జీ) కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా 110 నగరాలు, 300 పట్టణాలలో నిర్వహించడం ద్వారా కనీసం 40  లక్షల మంది ప్రజలను చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. 
ఈ కార్యక్రమంలో భాగంగా 9  కలెక్షన్‌ వాహనాలు పలు నగరాలు, పట్టణాలలో తిరుగుతూ 5500 మెట్రిక్‌ టన్నుల ఈ–వ్యర్థాలను సేకరించనున్నాయి. దీనితో పాటుగా పాఠశాలలు, కార్పోరేట్‌ సంస్ధలు, బల్క్‌  వినియోగదారులు, రిటైలర్లు, రెసిడెంట్‌  వెల్ఫేర్‌ అసోసియేషన్ల నడుమ అవగాహన కార్యక్రమాలు  నిర్వహించడంతో పాటుగా ఆరోగ్య శిబిరాలనూ నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఉత్తరాన న్యూఢిల్లీ, జమ్మూ ; తూర్పున కోల్‌కతా, గౌహతి, రాంచి ; పశ్చిమాన అహ్మదాబాద్‌  మరియు దక్షిణాన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో జరుగనుంది. ఈ కలెక్షన్‌వాహనాలతో పాటుగా ఉన్న సిబ్బంది ఈ–వ్యర్ధాలను  వినియోగదారుల నుంచి సేకరిస్తారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి ఆర్‌ఎల్‌జీ ఇండియా  మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధికా కాలియా మాట్లాడుతూ ‘‘ మహమ్మారి పలు పరిశ్రమల వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ మేము స్థిరంగా ఈ–వ్యర్ధ అవగాహన కార్యక్రమాన్ని ప్రజల నడుమ నిర్వహించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు. క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటుగా తగిన రీతిలో ఈ–వ్యర్ధాలను  నాశనం చేయడం, రోజువారీ జీవితంలో రీసైక్లింగ్‌ సాంకేతికతలను వినియోగించడాన్ని ప్రోత్సహించడం చేస్తున్నాం’’  అని చెప్పారు. ఈ క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌  ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో డిచ్‌పల్లి వద్ద విజయవంతంగా ఈ–వ్యర్థ సేకరణ చేయడంతో పాటుగా అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించారు.