- ఆస్తిని కొట్టేసేందుకు యాప్ ప్లాన్
- వాయిస్ రికార్డర్ తో మాటలు విని ఇంట్లో చోరీ చేసిన కొడుకు
హైదరాబాద్, వెలుగు: తండ్రి ఆస్తిని కొట్టేసేందుకు కొడుకే సైబర్ క్రిమినల్ అయ్యాడు. ఫోన్లో ఆటోమెటిక్ వాయిస్ రికార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి ఇంటిని లూటీ చేశాడు. రూ.30 లక్షల విలువ చేసే సొత్తును కాజేశాడు. బాధిత తల్లిదండ్రులు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన వైకుంఠం(79)కు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్గా చేస్తున్నారు. రెండో కొడుకు ఎంబీఏ పూర్తి చేసి భార్యతో కలిసి కరీంనగర్లోని తండ్రి ఇంటి సమీపంలో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ బేగంపేట్లోని కొడుకుల వద్దకు భార్యతో కలిసి వైకుంఠం వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో వైకుంఠం మొబైల్ ఫోన్లో కొడుకు ఆటోమెటిక్ వాయిస్ రికార్డర్ యాప్ ఇన్స్టాల్ చేశాడు. తండ్రి ఫోన్ నుంచి వాయిస్ రికార్డర్ను తన మెయిల్కి కనెక్ట్ చేసుకున్నాడు. మరో ఇద్దరు కొడుకులతో పాటు తల్లితో తండ్రి మాట్లాడే ప్రతీ విషయాన్ని ట్రాక్ చేశాడు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేటపుడు ఇంటి తాళాలు, క్యాష్ ఎక్కడ పెట్టాడో తెలుసుకున్నాడు.
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సుమారు రూ.30లక్షల విలువ చేసే బంగారం, వెండి నగలు, క్యాష్ను దొంగిలించాడు. ఎప్పటిలాగే ఇంటికి తాళాలు వేశాడు. హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లిన వైకుంఠం దంపతులు ఇంట్లో చోరీ విషయం గుర్తించారు. యాప్ ఇన్స్టాల్తో తమ విషయాలు తెలుసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.