ఆర్నెళ్లుగా ఆర్కేపీ ఆస్పత్రిలో  ఎక్స్​రే మెషీన్​ మూలకు

ఆర్నెళ్లుగా ఆర్కేపీ ఆస్పత్రిలో  ఎక్స్​రే మెషీన్​ మూలకు

 రామకృష్ణాపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​లోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో  ఆరు నెలలుగా ఎక్స్​ రే మెషీన్​ పనిచేయడంలేదు.  గనుల్లో ఆక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాల్లో కాలు, చేతులు విరిగిన పేషెంట్లు, ఇతర  రోగాలతో  వచ్చే వారు  నానా ఇబ్బందులు పడుతున్నారు.  డిజిటల్​ ఎక్స్​రే యూనిట్​ పనిచేయకపోవడంతో డాక్టర్లు మాన్యూవల్​  ఫిల్మ్​ ఎక్స్​రేపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎక్స్​రే రిపోర్ట్​ కోసం  రోజంతా వేచి ఉండాల్సి వస్తోంది.    కొందరు బయట నుంచి డిజిటల్​ ఎక్స్​రే రిపోర్టు తేవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. అయినా  నెలలు గడుస్తున్నా  కొత్త ఎక్స్​రే మెషీన్​ ఏర్పాటు చేయడం లేదని కార్మికులు  సింగరేణి యాజమాన్యంపై ఫైర్​ అవుతున్నారు.  

బెల్లంపల్లి రీజియన్​లో కీలకం…

సింగరేణి ఏరియా ఆస్పత్రి బెల్లంపల్లి రీజియన్​ పరిధిలో మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాలకు కీలమైంది. దీంతోపాటు,  మందమర్రి లోని డిస్పెన్సరీ, శ్రీరాంపూర్ ఏరియా​లో రెండు డిస్పెన్సరీలు, జైపూర్​లో ఒక డిస్పెన్సరీ ద్వారా  సాధారణ వైద్య సేవలు అందుతుండగా  ఎమర్జెన్సీ, ఇతర కీలక ట్రీట్​మెంట్​కు  సింగరేణి ఏరియా ఆస్పత్రిపై ఆధారపడాల్సిందే.  నిత్యం వందలాది సంఖ్యలో ట్రీట్​మెంట్​ కోసం ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి వస్తారు.     సాధారణంగా  ప్రతిరోజు ఆసుపత్రిలో 80 నుంచి 150 మందికి పైగా ఎక్స్​రే  తీస్తారు. అయితే ఆరు నెలలుగా  పేషీన్​ పనిచేయకపోవడంతో పెషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.  మరోవైపు ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి ఎక్స్​కే రిపోర్టు కోసం మాన్యువల్​ ఫిల్మ్​ డెవలపింగ్​ సిస్టంపై ఆధారపడుతున్నారు.  దీంతో కార్మిక కుటుంబాలు రిపోర్టు కోసం రోజంతా ఆస్పత్రిలో పడిగాపులు కాస్తున్నారు.   ఆ రిపోర్టును మరుసటి రోజు డాక్టర్​ వద్దకు తీసుకవెళ్లడంతో ట్రీట్​మెంట్​ లో ఆలస్యం అవుతోంది.   ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని సీటీస్కాన్​ ను ఎమర్జెన్సీ ఎక్స్​రే కోసం డాక్టర్లు అవసరాన్ని బట్టి వాడుతున్నారు.   ఆస్పత్రిలో  కొత్త ఎక్స్​రే యూనిట్​ను ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. 

రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం

ఎక్స్​రే మెషీన్​ అవసరమైన ​  పరికరాలు అందుబాటులో లేక పనిచేయడంలేదు. ​ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లాం. రోగులకు ఇబ్బంది కలుగకుండా ప్రస్తుతం మాన్యువల్​ ఫిల్మ్​ రిపోర్టు ఇస్తున్నాం. సింగరేణి  కార్పోరేట్​ యాజమాన్యం, రూ.22లక్షలతో కొత్తగా    మెషీన్​ను  కొనే  ప్రక్రియ చేపట్టింది. త్వరలోనే  కొత్త మెషీన్​ ఏర్పాటు చేస్తాం. - డాక్టర్​ ఉషా, డీవైసీఎంవో , ఆర్కేపీ సింగరేణి ఏరియా ఆసుపత్రి