ఆషాఢ ఏకాదశి.. పేలాల పండుగ.. ఉపవాసం ఎందుకు ఉండాలి?

ఆషాఢ  ఏకాదశి.. పేలాల పండుగ..  ఉపవాసం ఎందుకు ఉండాలి?

ఏదైనా పనిని కొత్తగా ప్రారంభించేవారు తిథి (మంచిరోజు) చూసుకుంటారు. ఏకాదశి అంటే చాలా మంచిరోజు అంటారు. ఏకాదశికి ఉన్న ప్రత్యేకత అది. ఏడాది పొడవునా 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి ( జూన్ 29) పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. సంవత్సరంలో  వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ''తొలి ఏకాదశిగా'' గా పిలుస్తారు. దీనినే ''శయనైకాదశి'' అని ''హరి వాసరమని'' పేలాల పండుగ'' అని కూడా అంటారు. పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ రోజున విష్ణువుకు సంబంధించిన ఆలాయాలను దర్శించాలి.  

ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. గురువారం(జూన్ 29) నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంటారు. కార్తీకపౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు... పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు.

పురాణాల ప్రకారం

ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. తొలిఏకాదశి  రోజు..  రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్లిన  స్వామివారు మళ్లీ  నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ యోగ నిద్ర ద్వారా...భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అనేందుకు సూచన.

తొలి ఏకాదశి .... 

కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి ఆమె 'ఏకాదశి' తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు 'ఏకాదశి' వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారని పురాణాల్లో పేర్కొన్నారు.

 ఉపవాసం ఎందుకు

ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నంటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని వేదాలు చెబుతున్నాయి. ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్యదీక్ష చేస్తారు. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.

 శరీరంలో నూతనోత్తేజం

ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది.  భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. 

ఏకాదశి నాడు ఏం చేయాలి: 

ఏకాదశి నాడు(జూన్29) ఉపవాసం ఉండి..ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి(జూన్ 30) రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి (జూన్ 29)నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది.. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే.. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.

పేలాల పిండి: 

తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.

ఎలా తయారు చేయాలి

జొన్నలు  లేదా మొక్కజొన్నల పేలాలను శుభ్రం చేసుకోవాలి.  ఆ తరువాత వాటిని పిండి చేసుకొని అందులో బెల్లం, యాలకులు, లవంగాలు వంటివి చేర్చి బాగా కలపాలి.  ఇది  ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి శరీరానికి ఈ పిండి వేడి కలిగించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.