అక్రమంగా తరలిస్తున్న జీలుగ విత్తనాలు పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న జీలుగ విత్తనాలు పట్టివేత

తొర్రూరు, వెలుగు: జీలుగు విత్తనాలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వివరాల ప్రకారం.. తొర్రూరు పట్టణానికి చెందిన చదలవాడ ఉపేందర్ జనగామ జిల్లా తరిగొప్పుల మండలం ఆగ్రోస్​ రైతు సేవా కేంద్రం సురేశ్, బచ్చన్నపేట ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం శ్రీనివాస్ రెడ్డి నుంచి అక్రమంగా జీలుగు విత్తనాల బస్తాలు తక్కువ ధరకు కొని ఆంధ్రాకు తరలిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున విశ్వసనీయ సమాచారంతో తొర్రూరు పోలీసులు ఉపేందర్ ఇంట్లో విత్తనాల బస్తాలు మారుస్తున్న టైంలో దాడి చేసి, విత్తన బస్తాలను స్వాధీనం చేసుకున్నారన్నారు.

 పట్టుబడిన విత్తనాలు సుమారుగా 106 బస్తాలు ఉండగా, ఒక్కో బస్తా 60 కిలోలు ఉంది. మొత్తం విలువ సుమారు రూ. 4.75 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడుల్లో రెండు బొలేరో వాహనాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఐదుగురుపై కేసు నమోదు చేశామని, ఆంధ్రాకు చెందిన శేషాద్రి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, సీఐ గణేశ్, ఏడీఏ విజయ చంద్ర, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.