నిజామాబాద్, వెలుగు: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు పిలువగానే పలికే నాయకులు అవసరమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో బీజేపీ కలుషిత రాజకీయాలు ఏ మాత్రం ఆమోదం కాదన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీని విశ్వసించొద్దని, స్థానిక డెవలప్మెంట్ కోసం జరుగుతున్న ఎలక్షన్లో దేవుడి పేరెందుకని పిల్లలు కూడా నవ్వుకుంటున్నారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురేయాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు.
పదేండ్లలో అభివృద్ధి చాలా వెనుకబడిందని, దానిని పరుగులు పెట్టించాల్సి ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉన్నందున ఫండ్స్ కొరత ఉండదని తెలిపారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తలేరని, తమ సర్కార్ వచ్చాక కొత్త రేషన్ కార్డులివ్వడమే కాకుండా ఖర్చుకు వెనుకాడక సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీ, మహిళలకు ఉచిత బస్ జర్నీ తో పాటు రూ.500 గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామన్నారు. వేల సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామన్నారు. పేదల ఆకలి తీర్చడంతో పాటు వారికి అండగా ఉండే స్కీమ్లకంటే గొప్ప ఏముంటదని అది బీజేపీ, బీఆర్ఎస్కు చేతకాదన్నారు.
అద్దాలు పట్టుకొని చేతులూపుతూ రాజకీయాలు చేస్తున్నరని మండిపడ్డారు. నిజామాబాద్ను దేశంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పానికి సపోర్టుగా నిలవాలని ప్రజలను కోరారు. జిల్లాలో 35 ఏండ్ల నుంచి నానుతూ వచ్చిన గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీని టీపీసీసీ ప్రెసిడెంట్గా మూడు నెలల్లో తెచ్చానని, అగ్రికల్చర్ కాలేజీ కూడా శాంక్షన్ చేయించగా బిల్డింగ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన వేశారన్నారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్ తాహెర్, డీసీసీ ప్రెసిడెంట్ నగేష్రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి తదితరులు ఉన్నారు.
