తొలిరోజే తేమ పేరిట ట్రేడర్ల డ్రామా

తొలిరోజే తేమ పేరిట ట్రేడర్ల డ్రామా
  • పత్తికి ఎక్కువ రేటు వస్తుండడంతో ఏకమైన వ్యాపారులు
  • మాయిశ్చర్ సాకుతో ధర తగ్గించే యత్నాలు
  • కటాఫ్ కు 8 శాతం.. ఆపై పాయింట్ కు కిలో తరుగుకు నిర్ణయం
  • ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఆగ్రహించిన రైతులు
  • మహారాష్ట్ర వ్యాపారులకు లేని నిబంధన ఇక్కడ ఎందుకని ఆగ్రహం

ఆదిలాబాద్,​ వెలుగు:  ఈ ఏడాది పత్తికి మంచి ధర పలుకుతోందని సంతోషించిన రైతులకు ఆదిలాబాద్​మార్కెట్​యార్డులో తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ఇంత రేటు ఎందుకు పెట్టాలనుకున్నారో ఏమో, వ్యాపారులంతా ఏకమయ్యారు. తేమ పేరిట కోతలు పెడుతూ కొత్త లెక్కలు చెప్పడంతో రైతులు షాక్​కు గురయ్యారు. పక్కనున్న మహారాష్ట్రలో మాయిశ్చర్​తో సంబంధం లేకుండా వ్యాపారులు క్వింటాల్​కు రూ.8 వేలు పెడుతుంటే, అక్కడికంటే తక్కువ ధర పెడుతున్న ఇక్కడి వ్యాపారులు, తేమ పేరిట 8 శాతం కటాఫ్​ పెట్టడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోయారు. సోమవారం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిసి మార్కెట్​కు వివిధ వాహనాల్లో తెచ్చిన కాటన్​లో సరాసరి 15 శాతం మాయిశ్చర్​ఉందని, ఈ లెక్కన క్వింటాల్​కు రూ.6,365 మాత్రమే దక్కుతుందని తెలిసి మార్కెట్​యార్డులోనే ఆందోళనకు దిగారు. ఇది చాలదన్నట్లు మార్కెట్​ యార్డులో ఒకసారి, జిన్నింగ్​లో మరోసారి మాయిశ్చర్​టెస్ట్​ చేయాలని ట్రేడర్స్​ చెప్పడంతో మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు కిసాన్​ చౌక్​లో ధర్నా చేశారు. ఇలా తొలిరోజు ఆదిలాబాద్​మార్కెట్​యార్డులో వ్యాపారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా పత్తిరైతుల్లో చర్చ మొదలైంది. 

ఇంటర్​ నేషనల్​ మార్కెట్​లో మంచి ధర..

కరోనా తర్వాత మూతపడ్డ టెక్స్​టైల్స్​ ఇండిస్ట్రీస్​ అన్నీ తెరుచుకోవడంతో ప్రస్తుతం ఇంటర్​నేషనల్​ మార్కెట్​లో కాటన్​ బేళ్లకు మంచి డిమాండ్​ ఉంది. ఒక్కో బేల్​కు రూ.40 వేల దాకా పలుకుతోందని ట్రేడర్స్​ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రేటు ఇంకా పెరిగే ఛాన్స్​ ఉందని అంటున్నారు. మరోవైపు భారీ వర్షాల వల్ల మిగిలిన రాష్ట్రాల్లో కాటన్​దిగుబడులు అంతగా రాకపోవడంతో అందరి దృష్టి మన పత్తిపైనే పడింది. ఈక్రమంలోనే ఆదిలాబాద్​ లాంటి జిల్లాలో బార్డర్​ గ్రామాల్లో పండిన పత్తిని మహారాష్ట్ర వ్యాపారులు ఎలాంటి తేమ కొర్రీలు లేకుండా క్వింటాల్​కు రూ. 8వేల దాకా పెట్టి కొంటున్నారు. తాజా పరిస్థితుల్లో రైతుకు రూ. 8 వేలకుపైగా ధర ఇచ్చినప్పటికీ వ్యాపారులకు భారీగానే మిగులుతుందని కాటన్​ ఎక్స్​ పర్ట్స్​ చెబుతున్నారు. ఒక్కో బెల్​ తయారు చేయడానికి ట్రేడర్స్​ 5 క్వింటాళ్ల పత్తిని వినియోగిస్తారు. ఇందులో 170 కిలోల లింట్​ (క్వాలిటీ కాటన్​), 325 కిలోల సీడ్​ వస్తుంది. లింట్​ ద్వారా తయారయ్యే బెల్​ కు రూ. 40 వేలు రాగా, 325 కిలోల సీడ్​కు క్వింటల్​కు రూ.3,300 లెక్కన మరో రూ.10వేలకుపైగా వస్తాయి. ఈలెక్కన 5 క్వింటాళ్ల పత్తిపై  ట్రేడర్​ రూ.50 వేలవరకు సంపాదిస్తాడు. రైతుకు రూ.8వేల చొప్పున రూ.40 వేలు పోయినా సీడ్​పై వచ్చే రూ.10 వేలు మిగులుతుంది.

ఆదిలాబాద్​లో రోజంతా ఆందోళన

ఆదిలాబాద్​ మార్కెట్​యార్డులో సోమవారం నుంచి పత్తి  కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తెల్లారేసరికి ఉమ్మడి ఆదిలాబాద్​ నలుమూలల నుంచి రైతులు మార్కెట్​కు వివిధ వాహనాల్లో కాటన్​తెచ్చారు. కాగా, వ్యాపారులు మాయిశ్చర్​ పేరిట 8 శాతం కటాఫ్​ పెడుతామని చెప్పారు. కాటన్​లో సరాసరి 15 శాతం మాయిశ్చర్​ఉందని, ఈ లెక్కన క్వింటాల్​కు రూ.6,365 మాత్రమే దక్కుతుందని తెలిసిన రైతులు ఆందోళనకు దిగారు. దీంతో 8 శాతం మాయిష్చర్​ ఉన్న  కాటన్​ను రూ.7,970 చొప్పున కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఒప్పుకున్నారు. దీంతో గంట ఆలస్యంగా ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ ఆధ్వర్యంలో ఆఫీసర్లు, ట్రేడర్స్​, రైతుల సమక్షంలో వేలంపాట మొదలైంది. రూ.7,400 నుంచి మొదలైన వేలం రూ.7,920 వద్ద ఆగింది. మహారాష్ట్రలో 8వేలకు పైగా ధర ఉందని, ఇక్కడ కూడా పెంచాలని రైతులు పట్టుపట్టారు. దాంతో మార్కెట్​యార్డులోనే దాదాపు 2 గంటలకుపైగా రైతులు నిరసన వ్యక్తంచేశారు. కలెక్టర్​ సముదాయించినా వినకపోవడంతో మరో రూ.50 పెంచి క్వింటాల్​ ధర రూ.7,970 గా ప్రకటించారు.  అనంతరం కలెక్టర్​ కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు. తీరా మార్కెట్​ యార్డులో ఒకసారి, జిన్నింగ్ మిల్లు​లో మరోసారి మాయిష్చర్​ టెస్ట్​ చేయాల్సి ఉంటుందని ట్రేడర్స్​ చెప్పడంతో మరో వివాదం మొదలైంది.  జిన్నింగ్​మిల్లులో టెస్ట్​ చేయడమంటే కొర్రీలు పెట్టి, డబ్బులు కట్​చేయడమేనని  రైతులు వాదించారు. ఒకేసారి టెస్ట్​ చేసి దాని ఆధారంగానే కొనుగోళ్లు జరపాలని రైతులు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు కిసాన్​ చౌక్​లో ధర్నా చేశారు. ఆపీసర్లు ఎంత సముదాయించినా రైతులు వినలేదు. ముందుగా ప్రకటించిన ధరతో అమ్మేందుకు కొందరు రైతులు ముందుకు రావడంతో పోలీసులు దగ్గరుండి కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రతి కొనుగోలులో మాయిష్చర్​ 15 శాతానికి పైగానే వచ్చింది. అంటే ఒక్కో శాతానికి ఒక కిలో చొప్పున ధర తగ్గించగా సరాసరి రైతుకు క్వింటాల్​కు రూ. 7365 ధర దక్కింది. 

ఏనుమాములలో క్వింటాల్​ పత్తికి రూ.7.900లు

వరంగల్​ సిటీ/ మహబూబాబాద్, వెలుగు: వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం మెరిసింది. సోమవారం ఇక్కడికి  సుమారు 15వేల పత్తి బస్తాలు వచ్చాయి. గరిష్టంగా క్వింటాల్​ పత్తికి రూ.7.900ల పలికితే..కనిష్టంగా రూ.6వేలు రేటు వచ్చింది. మహబూబాబాద్​ అగ్రికల్చర్​ మార్కెట్​లో క్వింటాల్​ పత్తి ధర గరిష్టంగా రూ.7906 వరకు పలికింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధర రావడం పట్ల  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.