కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్పై టీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఎంత ఎన్నికల ప్రచారం చేసినా జనాలు ఓటేసేందుకు వస్తారా? అని ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ శాతంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించేందుకు.. ఒక్కొక్కరికి రూ.2 వేల దాకా ముట్టజెప్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లోని జనం ఎన్నికల ప్రచారం కోసం తమ ఇంటికి రావొద్దంటూ గేట్లకు పోస్టర్లు అంటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లకు అధికార పార్టీ నేతలు డబ్బులు ఇస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30న వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
తామే ఎక్కువిస్తున్నమన్న ఓ లీడర్
మహమ్మారి ప్రభావం పోలింగ్పై పడకుండా స్థానిక నేతలతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్ల ఫోన్ నంబర్లను తీసుకుని ఫోన్ చేస్తున్నారు. ఓటేయడానికి వస్తే రూ.2 వేలు ఇస్తామంటున్నారు. డబ్బులు తీసుకున్నోళ్లు కచ్చితంగా తమకే ఓటేస్తారన్న నమ్మకం ఉందని వరంగల్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్న టీఆర్ఎస్ నేత ఒకరు చెప్పారు. ‘‘మిగతా పార్టీలు డబ్బులు ఎక్కువ ఇవ్వలేవు. మేమే ఎక్కువగా ఇస్తున్నాం. పోలింగ్ శాతం తగ్గితే కొన్ని చోట్ల టీఆర్ఎస్ రెబెల్స్ గెలిచే ప్రమాదం ఉంటుంది. అందుకే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆ లీడర్ చెప్పుకొచ్చారు. ఇక, ఓటర్లకు డైరెక్ట్గా డబ్బులివ్వకుండా గూగుల్ పే లేదా ఫోన్ పే వంటి వ్యాలెట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. డైరెక్ట్గా డబ్బులిస్తే మహమ్మారి తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదముండడంతో ఆన్లైన్ ద్వారా డబ్బులు ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది.