
- నిజామాబాద్ జిల్లాలో ఘటన
నిజామాబాద్, వెలుగు: కూలీ డబ్బుల వివాదం ఇద్దరి హత్యకు దారితీసింది. కండ్లలో కారం కొట్టి, కత్తులతో దాడి చేయడంతో వారు స్పాట్ లోనే చనిపొయారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరా(ఏ)లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జిల్లాలోని గౌతం నగర్కు చెందిన జిలకర్ర ప్రసాద్ (35)కు ధర్మోరా (ఏ)కు చెందిన ఓ వితంతువుతో వివాహేతర సంబంధం ఉంది. ప్రసాద్ తరుచూ ఆ మహిళా ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆ మహిళ మైనర్ కొడుకు అదే గ్రామంలోని నర్సయ్య అనే వ్యక్తి దగ్గర కొంతకాలంగా కూలీ పనులకు వెళ్తున్నాడు.
అయితే, నర్సయ్య ఆ మైనర్కు కూలీ డబ్బులు సరిగా ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని ఆ బాలుడు తన తల్లికి చెప్పగా, 15 రోజుల కింద నర్సయ్యతో ఆ మహిళ గొడవ పడింది. తర్వాత గొడవ విషయాన్ని ఆ మహిళ ప్రసాద్కు చెప్పింది. దీంతో నర్సయ్యను, అతనికి మద్దుతుగా మాట్లాడిన గంగారాంను ప్రసాద్ బెదిరించాడు. ఈ క్రమంలో గౌతం నగర్లో ఉండే ఆకాశ్ (22)తో కలిసి ప్రసాద్ మద్యం తాగాడు. అనంతరం వారిద్దరూ కలిసి ధర్మోరాలోని గంగారాం ఇంటికి వెళ్లి, అతనిపై దాడికి యత్నించారు. అయితే, అక్కడే ఉన్న గంగారాం కొడుకులు ఆకాశ్, ప్రసాద్ కండ్లల్లో కారం కొట్టి, కత్తులతో దాడి చేయడంతో వారిద్దరూ స్పాట్లోనే మరణించారు.