వరంగల్‍ ఆఫీసర్స్ క్లబ్‍లో రూ.2 కోట్ల చీటింగ్‍

వరంగల్‍ ఆఫీసర్స్  క్లబ్‍లో రూ.2 కోట్ల చీటింగ్‍
  • సభ్యత్వం పేరుతో145 మంది దగ్గర డబ్బులు వసూలు 
  • క్లబ్‍ అకౌంట్​లో డబ్బులు జమ చేయకుండా ఫ్రాడ్‍
  • ముగ్గురు నిందితులను అరెస్ట్  చేసిన సుబేదారి పోలీసులు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ సిటీలో కలెక్టర్‍, ఎమ్మెల్యేలు, డాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు వంటి వీఐపీలు, వీవీఐపీలు సభ్యులుగా ఉండే ఆఫీసర్స్  క్లబ్‍లో మెంబర్‍షిప్‍ ఇప్పిస్తామని చెప్పి క్లబ్‍ మేనేజర్‍ మరో ఇద్దరితో కలిసి రూ.2 కోట్లు జేబులో వేసుకున్నాడు. ఈ ఘటనలో సుబేదారి పోలీసులు ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్ట్  చేశారు. ఇన్స్​పెక్టర్​ పి.సత్యనారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. గోలి గోపాల్‍రెడ్డి 2015లో అప్పటి క్లబ్‍ జాయింట్‍ సెక్రటరీ ద్వారా ఆఫీసర్స్  క్లబ్​లో మేనేజర్‍గా చేరాడు. 

ఈజీ మనీ సంపాదించేందుకు ప్లాన్‍ చేశాడు. క్లబ్‍లో కొత్త మెంబర్‍షిప్‍ ఇవ్వాలంటే ఎంట్రీ ఫీజుగా రూ.1.40 లక్షలు వసూలు చేస్తారు. దీనిని గోపాల్‍రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మెంబర్‍షిప్‍ కోసం వచ్చే వారి నుంచి వసూలు చేసిన రూ.1.30 కోట్లు క్లబ్‍ మినిట్స్, అకౌంట్‍ బుక్‍లో నమోదు చేయకుండా జేబులో వేసుకున్నాడు. వారికి మాత్రం ఐడీ కార్డులు జారీ చేశాడు. కాగా, 2019లో అప్పటి జాయింట్‍ సెక్రటరీ చెరుకు వెంకట రాజిరెడ్డి కొందరిని క్లబ్‍లో జాయిన్‍ చేసేందుకు మేనేజర్‍కు రూ.4.20 లక్షలు ఇవ్వగా, వాటిని కూడా అకౌంట్​లో జమ చేయలేదు. ఆపై రాజిరెడ్డి కూడా మెంబర్‍షిప్‍ల పేరుతో రూ.60 లక్షలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడు.

 వీరిద్దరికి అక్కడే షటిల్‍ బాయ్‍గా పనిచేసే పొడిశెట్టి రవీందర్‍ చేరాడు. అతను కొందరిని సభ్యులుగా చేర్పించగా, గోపాల్‍రెడ్డి పలు దఫాలుగా రవీందర్‍కు రూ.10 లక్షలు ఇచ్చాడు. ముగ్గురు కలిసి చేస్తున్న మెంబర్​షిప్‍ దందా అక్కడే బార్​లో పని చేసే శ్రీనివాస్‍కు తెలిసింది. దీంతో వారు విషయం బయట చెప్పకుండా ఉండేందుకు మెంబర్‍షిప్‍ దందా చేస్తే రూ.10 లక్షలు కమీషన్‍ ఇస్తామని ఆఫర్‍ ఇచ్చారు. ఆపై మాట మార్చడంతో.. శ్రీనివాస్‍ గతేడాది ఏప్రిల్‍ 24న తన చావుకు గోపాల్‍రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్‍ కారణమని వీడియో తీసి తన కొడుకుకు పంపించాడు. 

ఆపై ఆఫీసర్స్  క్లబ్‍లో ఫ్యాన్‍కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై సుబేదారి పోలీస్‍ స్టేషన్​లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు కోసం కమిటీ వేసి విచారణ చేయగా.. గోపాల్‍రెడ్డి రూ.1.30 కోట్లు, రాజిరెడ్డి రూ.60 లక్షలు, రవీందర్‍ రూ.10 లక్షలతో కలిపి రూ.2 కోట్లు సభ్యత్వాల డబ్బులు క్లబ్‍ అకౌంట్​లో జమ చేయకుండా కాజేసినట్లు తేలింది. మెంబర్‍షిప్‍ పేరుతో 145 మందిని మోసం చేసినట్లు గుర్తించారు. ఆదివారం క్లబ్‍ లో సీక్రెట్‍గా కలిశారనే సమాచారంతో సుబేదారి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.