ఎండుతున్న ఎల్లంపల్లి .. ప్రాజెక్టులో నీటి నిల్వ 7.664 టీఎంసీలే

ఎండుతున్న ఎల్లంపల్లి .. ప్రాజెక్టులో నీటి నిల్వ 7.664 టీఎంసీలే
  • గూడెం లిఫ్ట్ నుంచి సాగునీటి సప్లై బంద్ 
  • చివరి దశలో పొలాలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన  
  •  మిగిలిన నీళ్లు తాగునీటి అవసరాలకే వాడాలని అధికారుల ఆదేశాలు

 మంచిర్యాల, వెలుగు :  ఎండలు ముదురుతున్న కొద్దీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్​ లెవల్స్​ పడిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్​తో జలాశయంలోని నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో సమస్యలు తలెత్తడం వల్ల రివర్స్​ పంపింగ్​ నిలిచిపోడంతో ఈ ప్రాజెక్టుకు నీటి కటకట ఎదురైంది. గూడెం లిఫ్ట్​ నుంచి సాగునీటి సప్లై బంద్​ కాగా, చివరి దశలో పొలాలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలు. అయితే, బుధవారం నాటికి  నీటిమట్టం7.664 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్​ మెట్రో వాటర్​ సప్లై స్కీమ్​కు 308 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు సప్లై చేస్తున్నారు. అలాగే, మిషన్​ భగీరథ స్కీమ్​ కోసం మంచిర్యాల గ్రిడ్​కు 23 క్యూసెక్కులు, రామగుండం గ్రిడ్​కు 58 క్యూసెక్కులు ఇస్తున్నారు.

ఇప్పటికే మంచిర్యాల గ్రిడ్​కు నీటి కొరత మొదలైంది. ప్రాజెక్టులోని ఇన్​టేక్​ వెల్​ దగ్గర వాటర్​ లెవల్స్​ పూర్తిగా తగ్గడంతో చిన్నపాటి కాలువ తీసి నీళ్లందిస్తున్నారు. అవసరమైతే గోదావరి మధ్యలో ఇన్​టేక్​ వెల్​ తవ్వి భగీరథకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రెండు నెలల్లో వాటర్​ లెవల్స్​ మరింత పడిపోయి మే నాటికి 3 టీఎంసీల డెడ్​ స్టోరేజీకి చేరుకునే అవకాశం ఉన్నది. దీంతో మిగిలిన నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడుకోవాలని ప్రాజెక్టు అధికారులకు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

ఎల్లంపల్లిపై కాళేశ్వరం ఎఫెక్ట్​

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి బ్యారేజీ తెలంగాణకు వాటర్​ హబ్​గా మారింది. ఇక్కడినుంచే మిడ్ ​మానేరు మొదలు మల్లన్నసాగర్​ వరకు రివర్స్​ పంపింగ్​ జరిగేది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో సమస్యలు తలెత్తడం వల్ల రివర్స్​ పంపింగ్​ నిలిచిపోయింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం నీటి కటకట ఎదురైంది. గోదావరికి ఎగువ ప్రాంతం, క్యాచ్​మెంట్​ ఏరియా నుంచి ఇన్​ఫ్లో పూర్తిగా బంద్​ అయ్యింది. కాళేశ్వరం నుంచి రివర్స్​ పంపింగ్​ చేసినప్పుడు ఎల్లంపల్లిలో 20 టీఎంసీల గరిష్ట సామర్థ్యం  మెయింటెయిన్​చేశారు. ఈ ఏడాది రివర్స్​ పంపింగ్​ చేసే అవకాశం లేదు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చని, ఈ ఎండాకాలం గడవడం కూడా కష్టమేనని అధికారులు చెబుతున్నారు.

గూడెం లిఫ్ట్​ కింద ఎండుతున్న పంటలు 

కడెం ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గూడెం లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ను ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ నుంచి 3 టీఎంసీలను లిఫ్ట్​ చేసి దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్​మండలాల్లోని 30 వేల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం. ప్రాజెక్టులో 18 టీఎంసీలు ఉంటేనే లిఫ్ట్​లు నడపాలనే ఆదేశాలున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్​లో వాటర్​ లెవల్స్​ అంతకంటే తగ్గడంతో ఆందోళన మొదలైంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ఉన్నతాధికారులపై ఒత్తిడి తేగా, యాసంగి సీజన్​లో15వేల ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీళ్లు ఇస్తామన్నారు. ఈ మేరకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు వాటర్​ సప్లై చేసి, రెండు రోజుల కిందట లిఫ్ట్​ బంద్​ చేశారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నది. ఈ సమయంలో లిఫ్ట్​ బంద్​ కావడంతో పొలాలు ఎండుతున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు మరో తడిని అందించాలని కోరుతున్నారు.