క్రైస్ట్చర్చ్: విమెన్స్ వన్డే వరల్డ్కప్లో ఇండియా టీమ్కు చావో రేవో. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో మిథాలీసేన.. బలమైన సౌతాఫ్రికాతో ఢీకొట్టనుంది. ప్రస్తుతం ఆరు మ్యాచ్ల్లో మూడు విజయాలు, మూడు ఓటములతో ఇండియా ఆరు పాయింట్లతో ఐదో ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్తు ఖాయం చేసుకోగా.. వరుసగా మూడు, నాలుగు, ఐదు ప్లేస్ల్లో ఉన్న వెస్టిండీస్ (7 పాయింట్లు), ఇంగ్లండ్ (6 పాయింట్లు), ఇండియా మరో రెండు బెర్తుల కోసం రేసులో నిలిచాయి. వెస్టిండీస్ మ్యాచ్లన్నీ ముగిశాయి. ఈ నేపథ్యంలో మిథాలీసేన.. సౌతాఫ్రికాపై గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్కు వెళ్తుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయి.. ఒక పాయింట్ వచ్చినా కూడా మెరుగైన రన్రేట్ (+0.768)తో టాప్4లో నిలుస్తుంది. ఓడితే మాత్రం ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ బంగ్లాపై ఇంగ్లండ్ విజయం సాధిస్తే.. ఆ టీమ్తో పాటు వెస్టిండీస్ 3,4 ప్లేస్లతో సెమీస్కు క్వాలిఫై అవుతాయి. బలహీన జట్టయిన బంగ్లాపై ఇంగ్లిష్ టీమ్ గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాపై విజయం సాధించి సెమీస్ చేరుకునేందుకు మిథాలీసేన శక్తి మొత్తం ధారపోయాల్సిందే. ముఖ్యంగా టోర్నీలో నిరాశ పరుస్తున్న బ్యాటర్లు తక్షణం బ్యాట్లకు పని చెప్పాలి. బ్యాటింగ్లో తడబడుతున్న కెప్టెన్ మిథాలీ టీమ్ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. విండీస్పై సెంచరీ తప్పితే పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్మృతి మంధాన టాప్ గేర్లోకి వస్తేనే ఇండియా ముందుకెళ్తుంది.