ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ప్రవీణ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసి,  వేరే అబ్బాయితో వివాహానికి సిద్దమవడాన్ని జీర్ణించుకోలేక ప్రవీణ్ తనువు చాలించాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో సూసైడ్ నోట్ తో పాటు ఓ సెల్ఫీ వీడియోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనను మోసం చేసిన యువతితో పాటు ఆమె స్నేహితులు, తన ఆత్మహత్య కు కారణమైన ఆమె ప్రియుడు విజయ్ భాస్కర్ ను కఠినంగా శిక్షించాలని వీడియోలో డిమాండ్ చేశాడు.

లెటర్ లోనూ తన చావుకి మూల కారణం విజయ్ భాస్కర్, తేజ శ్రీ అని, వారిని శిక్షించండి ప్లీజ్ అని ప్రవీణ్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ ఈ మద్య కాలంలో కానిస్టేబుల్ కు అర్హత సాధించి, మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. కాగా అతని స్వస్థలం వికారాబాద్ జిల్లా చౌడపూర్ గ్రామంగా పోలీసులు గుర్తించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్ మరణవార్త విన్న బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.