బెల్ట్​షాపుల్లో మద్యం అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే..రూ.10 వేల నజరానా

బెల్ట్​షాపుల్లో మద్యం అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే..రూ.10 వేల నజరానా
  •     జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి 

జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ఫిబ్రవరి 1 తరువాత మద్యం అమ్ముతున్నట్లు తనకు సమాచారం ఇస్తే రూ. 10 వేలు బహుమతిగా ఇస్తానని ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం జడ్చర్ల పోలీస్​స్టేషన్​లో ఎమ్మెల్యేతో కలిసి ఎస్పీ హర్షవర్ధన్​ నియోజకవర్గంలోని సీఐలు, ఎస్ఐలతో వివిధ అంశాలపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గంజాయి పెంపకం, అమ్మకాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. బెల్ట్​షాపులకు వచ్చే నెల 1వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత ఎక్కడైనా బెల్ట్​ షాపుల్లో మద్యం అమ్మినట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని ఖాళీ స్థలాల్లో మద్యం తాగకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాన్​ షాపుల్లో గుట్కాలు అమ్ముతున్నట్లు  సమాచారం వస్తే దాడులు చేయాలని సూచించారు. మద్యం, గంజాయి అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. డీఎస్పీ మహేశ్, సీఐలు రమేశ్​బాబు, జమ్ములప్ప పాల్గొన్నారు.