హైదరాబాద్, వెలుగు : కొత్త హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట, బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవో నంబర్ 55లో పేర్కొంది. కిందటి నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
సీఎం వెంటనే భూమి కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత అధికారులు ప్రతిపాదించిన స్థలాన్ని హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలన కూడా చేశారు. ఆ వెంటనే 100 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇదిలా ఉండగా కొంతమంది న్యాయవాదులు రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ గ్రామంలో హైకోర్టు నిర్మాణం చేస్తే అంత దూరం వెళ్లడం న్యాయవాదులకు కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.