టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. పేరే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఇప్పుడు సెంచరీ కొట్టింది. ఎందులో అంటారా.. కంపెనీలోని కోటీశ్వరుల జాబితాలో! కోటికి పైగా జీతం ఎత్తుకుంటున్న టీసీఎస్ ఉద్యోగులు 103 మందికి పెరిగారు. ఇందులో దాదాపు పావు శాతం మంది కంపెనీలోనే కెరీర్ను ప్రారంభించారు. 2017 ఆర్థిక సంవత్సరంలో కోటి వేతనం పొందుతున్న టాప్ అధికారులు 91 మంది ఉండగా, 2019 ఆర్థిక సంవత్సరంలో 103కు పెరిగారు. అది కూడా సీఈవో రాజేశ్ గోపీనాథన్, సీవోవో ఎన్జీ సుబ్రమణియంలను పక్కనబెడితే. వాళ్లిద్దరినీ కలిపితే ఆ సంఖ్య 105. అంతేగాకుండా విదేశాల్లో పనిచేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్లనూ లెక్కలోకి తీసుకోలేదు. ఇన్ఫోసిస్లోనూ కోటీశ్వరులైన ఉన్నతాధికారులు 60 దాకా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇన్ఫోసిస్లా టీసీఎస్ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ఇవ్వదు. ఈ జాబితా నివేదికను ఎకనామిక్ టైమ్స్ (ఈటీ) ప్రచురించింది.
అధికారికంగా ప్రకటించని టీసీఎస్
జీతం, అలవెన్సులు, క్యాష్ ఇన్సెంటివ్, ఆదాయపన్ను నిబంధనల ప్రకారం వారి ఆస్తుల విలువ, ప్రావిడెంట్ ఫండ్లో కంపెనీ భాగం లెక్కన ఉన్నతాధికారుల జీతం కోటి దాటిందని డైరెక్టర్లకు కంపెనీ ఇచ్చిన అనెగ్జర్లో పేర్కొన్నట్టు ఈటీ తెలిపింది. దీనికి సంబంధించి కంపెనీ ఇంకా వార్షిక నివేదికను ప్రచురించలేదని, స్పందించలేదని వెల్లడించింది. కాగా, కంపెనీ ఇంతలా సక్సెస్ అవడానికి కారణం, చాలా మంది సీనియర్లు స్థిరంగా కంపెనీలో ఉండడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర కంపెనీలకు టాలెంటెడ్ ఉద్యోగులను వదులుకోకుండా ఉండేలా చాలా మంది ఉద్యోగులకు నాయకత్వ బాధ్యతలను అప్పగించడంలో కంపెనీ ముందుండడమూ అందుకు కారణమని చెబుతున్నారు. ‘‘చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు టీసీఎస్ను వదల్లేదు. ఉద్యోగులు కంపెనీ విడిచి వెళ్లకుండా మంచి కెరీర్ బాటలు పరిచారు. నాయకత్వ వికేంద్రీకరణ కూడా కంపెనీకి మంచి చేసింది” అని ముంబైకి చెందిన బ్రోకరేజీ నిపుణుడు ఒకరు చెప్పారు. ఇక, త్రైమాసిక లక్ష్యాలను అందుకునేందుకు దాదాపు 200 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు పెద్ద బాధ్యతలను కంపెనీ అప్పగించింది. ఉన్నతస్థాయి అధికారులను ఆ లక్ష్యాల నుంచి విముక్తి కల్పించింది. సీఈవో, ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లాంటి వాళ్లకు కొత్త మార్కెట్లు, సర్వీసులకు ఎంటరవడం, వివిధ వర్గాల కస్టమర్లను ఆకర్షించడం వంటి 3–5 ఏళ్ల ప్రణాళికలపై పనిచేసే ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.
దేబాశిష్ ఘోష్కు 4.7 కోట్లు
కంపెనీలో ఎక్కువ మొత్తం జీతం అందుకుంటున్న ఉన్నతాధికారి దేబాశిష్ ఘోష్. టీసీఎస్ లైఫ్సైన్సెస్, హెల్త్కేర్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ హెడ్గా ఉన్న ఆయనకు ₹4.7 కోట్లు అందుతోంది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చీఫ్ కే కృతీవాసన్₹4.3 కోట్ల వార్షిక ప్యాకేజీ అందుకుంటున్నారు. రీటెయిల్ అండ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ హెడ్ ప్రతీక్ పాల్ ఏటా ₹4.3 కోట్ల ప్యాకేజీ పొందారు. అయితే, ఆయన ఆ తర్వాత డిజిటల్ ఇనిషియేటివ్ కోసం టాటా సన్స్కు బదిలీ అయ్యారు. బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ హెడ్ కృష్ణన్ రామానుజం ఏడాదికి ₹4.1 కోట్ల జీతం పొందుతున్నారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) కే అనంత కృష్ణన్ ₹3.5 కోట్ల జీతం అందుకుంటున్నారు. పెద్ద వయసులో కోటికి పైగా పారితోషికం అందుకున్న ఉద్యోగి 72 ఏళ్ల బరీంద్ర సాన్యాల్.