ఒళ్లు కాస్త వేడెక్కినా... జలుబు చేసినా... దగ్గొచ్చినా.. వెంటనే గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్లి వెతుకుతుంటారు. సింప్టమ్స్ని బట్టి ఎవరికి వాళ్లే ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి? ఏం జబ్బు చేసిందనే విషయాలు డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఎప్పుడో కాని డాక్టర్ని కలవరు. గూగుల్ డౌట్స్తో డాక్టర్స్ ని విసిగిస్తుంటారు కూడా. ఇదంతా చూసి ఓ డాక్టర్కి చిర్రెత్తుకొచ్చింది. దాంతో తన హాస్పిటల్ బయట ఓ నోటీస్ బోర్డు పెట్టాడు.. అందులో ఓపిడి ఛార్జీలు రాసుకొచ్చాడు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.
This doctor gets it totally right!!! pic.twitter.com/iW9Ou8UVwO
— Gaurav Dalmia (@gdalmiathinks) June 1, 2022
‘‘జబ్బు ఏంటో గుర్తించి... దానికి తగ్గ ట్రీట్మెంట్.. రెండూ నేనే చేస్తే ఫీజు రెండొందల రూపాయలు. నేను డయాగ్నస్ చేసిన వ్యాధికి.. మీరు చెప్పిన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఐదొందలు. గూగుల్ డౌట్స్కి వెయ్యి రూపాయలు. ఒకవేళ వ్యాధిని మీరే డిసైడ్ చేసుకుని.. నాతో ట్రీట్మెంట్ చేయించుకుంటే పదిహేనొందలు. మీరు డయాగ్నసిస్ చేసిన వ్యాధికి మీరు చెప్పిన ట్రీట్మెంట్ చేయాలంటే రెండువేల రూపాయలు’’ అని రాసి, నోటీస్ బోర్డు మీద పెట్టాడు. దీన్ని గౌరవ్ దాల్మియా అనే అతను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఫొటో కింద ‘ఈ డాక్టర్ ముమ్మాటికి కరెక్ట్’ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. డాక్టర్స్ ఫ్రస్ట్రేషన్కి సింబాలిక్గా ఉన్న ఈ పోస్ట్కి వేలల్లో లైక్స్ వస్తున్నాయి ఇప్పుడు. కానీ, ఈ డాక్టర్ జాడ మాత్రం ఇంకా తెలియలేదు.