న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరగకుండా ఆపడానికి అమెరికా ఆటోమేకర్ ఫోర్డ్ ఇండియాలోని తన పది వేల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించింది. వ్యాపారపరంగా ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారు తప్ప మిగతావాళ్లంతా ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. స్వీడిష్ లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో కూడా ఇండియాలోని తన 40మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని ఆదేశించింది.
తమ ఉద్యోగులను సురక్షితంగా ఉంచడంతోపాటు వైరస్ వ్యాపించకుండా ఆపడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫోర్డ్ ఇండియా తెలిపింది. ఆఫీసు నుంచే పనిచేస్తామనుకునే వాళ్లు ఆఫీసులకు రావొచ్చని పేర్కొంది. తమ రీజనల్ ఆఫీసులు, హెడ్క్వార్టర్లోని ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేయాలని టాటా మోటార్స్ కూడా ఆదివారం ఆదేశించింది.