
కొండపాక (కొమురవెల్లి), వెలుగు: ‘సీపీఆర్’తో 108 సిబ్బంది ఓ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన పర్వతం రాజు (28) ఆటో నడుపుతూ చిన్నకిష్టాపూర్ నుంచి కుకునూర్ పల్లికి వస్తున్నాడు. దారిలో ఆకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అటుగా వెళ్తున్న కరణ్ రెడ్డి అనే వ్యక్తి 108కి సమాచారం అందించాడు.
సిబ్బంది బైండ్ల మహేందర్, పైలెట్ పంజాల రమేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజును పరీక్షించి అతడి గుండె సరిగా కొట్టుకోవడం లేదని గుర్తించారు. వెంటనే మెడికల్ టెక్నీషియన్ మహేందర్ సీపీఆర్ చేశారు. దీంతో రాజు గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభమయింది. అనంతరం రాజును గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర స్థితిలో త్వరగా స్పందించినందుకు మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలెట్ రమేశ్ను పలువురు అభినందించారు.