తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష‌లు ర‌ద్దు.. ఎగ్జామ్స్ లేకుండానే పాస్!: సీఎం కేసీఆర్

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష‌లు ర‌ద్దు.. ఎగ్జామ్స్ లేకుండానే పాస్!: సీఎం కేసీఆర్

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పూర్తిగా ర‌ద్దు చేస్తూ.. ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండానే విద్యార్థులంద‌రినీ ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దేశంలో, రాష్ట్రంలో క‌రోనా ప్ర‌బ‌లుతున్న తీరు నేప‌థ్యంలో పదో తరగతి పరీక్షలపై ముఖ్యంమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఈ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది.

వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో పదో తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏం చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వాల‌ని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.