- రాష్ట్రానికి 13 స్వచ్ఛ అవార్డులు
- స్వచ్ఛ భారత్ మిషన్లో నంబర్ వన్
- అక్టోబర్ 2న అవార్డుల ప్రదానం
- సీఎం కేసీఆర్, కేటీఆర్ వల్లే అవార్డులు: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ మిషన్లో రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట పండింది. పారిశుధ్య నిర్వహణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలవడంతో పాటు వివిధ కేటగిరీల్లో13 స్వచ్ఛ అవార్డులు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్(ఎస్ఎస్ జీ) పెద్ద రాష్ట్రాల కేటగిరీలో రాష్ట్రానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. జిల్లాల కేటగిరీలో జగిత్యాలకు దేశంలో సెకండ్ ర్యాంక్, నిజామాబాద్కు థర్డ్ ర్యాంక్, అన్ని టాప్ జిల్లాల జోన్ల కేటగిరీలో నిజామాబాద్కు రెండో ర్యాంక్, భద్రాది కొత్తగూడెంకు మూడో ర్యాంక్ వచ్చింది.
సుజలం1.0, 2.0 రెండు క్యాంపెయిన్ల కేటగిరీల్లో తెలంగాణ దేశంలో వరుసగా థర్డ్ ర్యాంకులు సాధించింది. నేషనల్ ఫిలిమ్ కాంపిటీషన్ కేటగిరీలో రాష్ట్రంలోని నూకలంపాడు గ్రామ పంచాయతీ(ఎంకూరు మండలం) మూడో ర్యాంక్ సాధించింది. వాల్ పెయింటింగ్ కాంపిటీషన్ ఓడీఎఫ్ ప్లస్ బయో డిగ్రేడబుల్ వ్యర్థాల మేనేజ్మెంట్, గోబర్ ధాన్, ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్, మురుగు నీటి మేనేజ్మెంట్, బహిరంగ మలవిసర్జన మేనేజ్మెంట్ వంటి కేటగిరీల అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం సౌత్ జోన్లో ఫస్ట్ ర్యాంకు సాధించింది. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఈ అవార్డులను ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు.