మేడారం జాతరకు 1,300 బస్సులు : డైరెక్టర్ ఎం.రాజశేఖర్

మేడారం జాతరకు 1,300 బస్సులు : డైరెక్టర్ ఎం.రాజశేఖర్
  •     4 రోజులు నడపనున్న ఆర్టీసీ  
  •     ఇందులో 400 స్పెషల్ ​బస్సులు
  •     జాతర రూట్​లో అదనంగా మరో 900  

హైదరాబాద్​సిటీ, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం టీజీఎస్​ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 28 నుంచి జరిగే జాతర కోసం సోమవారం నుంచే ప్రత్యేక బస్సులు మొదలయ్యాయి. వీటిని ఈనెల 31వరకు నడపనున్నట్టు గ్రేటర్​ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ​డైరెక్టర్​ ఎం.రాజశేఖర్​ తెలిపారు. 

నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్​క్రాస్​ రోడ్స్​, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల నుంచి 400 బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులు ప్రయాణికులను జాతర గద్దెల వరకూ తీసుకెళ్తాయని అధికారులు తెలిపారు. 

ప్రత్యేక బస్సులు ఆగే ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం టెంట్లు ఏర్పాటు చేసి తాగునీటిని అందుబాటులో ఉంచారు. తొక్కిసలాట జరగకుండా ఆయా రూట్లలో బస్​లను కో ఆర్డినేట్​ చేసేందుకు స్పెషల్​ ఆఫీసర్లను నియమించారు. అలాగే, రోజూ గ్రేటర్​లో నడిచే 3,200 బస్సుల్లో 900 వాహనాలను జాతర రూట్లలో నడపనున్నారు. 

రేట్లు 50 శాతం అదనం

మేడారం వెళ్లే ప్రత్యేక బస్సుల్లో చార్జీలను 50శాతం పెంచినట్టు అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం ఎక్స్​ ప్రెస్​ బస్సుల్లోనే వర్తిస్తుందని చెప్పారు. 400 బస్సులను మేడారం జాతర కోసం నడుపుతున్న నేపథ్యంలో 5 రోజుల పాటు సిటీలోని కొన్ని రూట్లలో బస్సుల సంఖ్య తగ్గిస్తున్నట్టు తెలిపారు.