పీవీటీజీఎస్‌‌‌‌లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

పీవీటీజీఎస్‌‌‌‌లకు 13,266  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
  • 16 ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా 8,750 ఇండ్లు
  • స్టేట్ రిజర్వ్ కోటా కింద మంజూరు
  • ఉత్తర్వులు జారీ చేసిన హౌసింగ్ డిపార్ట్ మెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గిరిజనులైన పీవీటీజీఎస్ ( పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ )సభ్యులకు13,266  ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీవీటీజీఎస్ లో మొత్తం నాలుగు కులాలు  ( కొలం, చెంచు, కొండరెడ్లు, తోటి) ఉన్నాయి.  రాష్ర్టంలోని 4 ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌‌‌‌మెంట్ ఏజెన్సీ )లు అయిన ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, మున్ననూరులో ఉన్న 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు.

  అంతేగాక..16 ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా మరో 8,750 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఇండ్లను స్టేట్ రిజర్వ్ కోటా కింద శాంక్షన్ చేస్తున్నట్లు హౌసింగ్ సెక్రటరీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఒక్క ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోనే 10,836 మంది పీవీటీజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ ఇండ్ల నిర్మాణానికి పీఎం జన్మన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 1.20 లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఇది సాధారణ పీఎం అవాస్ యోజన కంటే (రూరల్‌‌‌‌లో రూ. 72 వేలు, అర్బన్‌‌‌‌లో రూ. 1.50 లక్షలు) ఎక్కువ.

ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా ఇండ్లు

రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా 8,750 ఇండ్లు మంజూరయ్యాయి.  ఇందులో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాలకు తలో 1,000 ఇండ్లు(మొత్తం వేలు), వైరాకు 750 ఇండ్లు.. అలాగే, ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని అదిలాబాద్, బోథ్, ఖానాపూర్, అసిఫాబాద్ నియోజకవర్గాలకు తలో 500 ఇండ్లు మంజూరయ్యాయి. ఏటూరు నాగారం ఐటీడీఏ పరిథిలోని ములుగుకు 1,500, మహబూబాబాద్, నర్సంపేటకు తలో 250 ఇండ్లు మంజురయ్యాయి.  

ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని మొత్తం 16 ఎస్టీ నియోజకవర్గాలకు 8,750 ఇండ్లను  ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసిన 3500 ఇండ్లకు ఇవి అదనంగా ప్రభుత్వం ఇచ్చింది.  ఐటీడీఏలు, ఏజెన్సీ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు బాధ్యతలను ఐటీడీఏ పీవో లకు అప్పగించింది. ఈ పీఓలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.  గతంలో ఈ బాధ్యతలు జిల్లా కలెక్టర్లు నిర్వహించగా, ఇప్పుడు వారిని మినహాయించి పీఓలకు అప్పగించారు.