బీఆర్ఎస్​కు 14 మంది కౌన్సిలర్ల రాజీనామా

బీఆర్ఎస్​కు 14 మంది కౌన్సిలర్ల రాజీనామా
  • నర్సంపేట మున్సిపల్​చైర్​పర్సన్​పై అవిశ్వాసం వీగడంతో నారాజ్​
  • బలం లేదని మీటింగ్​కు హాజరుకాని మెజారిటీ కౌన్సిలర్లు  
  • మాజీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగానే రిజైన్లన్న కౌన్సిలర్లు

వరంగల్​ / నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో చైర్​పర్సన్​గుంటి రజనీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసాన్ని  ప్రతిపాదించిన బీఆర్ఎస్​అసమ్మతి కౌన్సిలర్లు మెజార్టీ లేకపోవడంతో సమావేశానికి గైర్హాజరయ్యారు. బల్దియా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీరును నిరసిస్తూ అసమ్మతి కౌన్సిలర్లు  పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. నర్సంపేట మున్సిపల్​చైర్​పర్సన్​రజనీపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ బీఆర్ఎస్​కౌన్సిలర్లు కలెక్టర్​కు లెటర్​ ఇచ్చారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్​ప్రకటించారు. నర్సంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు 18 మంది, కాంగ్రెస్​కు ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా.. ప్రత్యేక సమావేశానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం కూడా రాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రిసైడింగ్​ఆఫీసర్, ఆర్డీఓ కృష్ణవేణి ప్రకటించారు. బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లలో నలుగురు మాత్రమే చైర్ పర్సన్​​కు మద్దతివ్వగా..ముగ్గురిని పొరుగు రాష్ట్ర  క్యాంప్​కు తరలించారు. మరొకరు ఇంట్లోనే ఉన్నారు. చైర్​పర్సన్​పై అసంతృప్తితో ఉన్న 14 మంది కౌన్సిలర్లు ఐక్యంగా ఉన్నా  అవిశ్వాసం నెగ్గాలంటే మరో ఇద్దరి మద్దతు కావాల్సి ఉంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరుగురు  అవిశ్వాసానికి దూరంగా ఉండడంతో వారి బలం సరిపోలేదు. దాంతో వారు  మీటింగ్​కు హాజరుకాలేదు.   

పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లు

అవిశ్వాసం వీగిపోవడంతో నారాజ్​అయిన 14 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్​కు  రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. వారు మీడియాతో మాట్లాడుతూ, అవిశ్వాసానికి దూరంగా ఉన్న ముగ్గురిపై మాజీ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి  రెండు రోజుల్లో చర్య  తీసుకోకపోతే  కౌన్సిలర్​ పదవులకు కూడా  రాజీనామా చేస్తామని  చెప్పారు. మున్సిపల్​వైస్​ చైర్మన్​మునిగాల వెంకట్​రెడ్డి, కౌన్సిలర్లు మినుముల రాజు, శీలం రాంబాబు, దేవోజు తిరుమల, నాగిశెట్టి పద్మ, రుద్ర మల్లీశ్వరి, జుర్రు రాజు, వేల్పుగొండ పద్మ, బానాల ఇందిర, లూనావతు కవిత, రామసహాయం శ్రీదేవి, గందె రజిత, గంప సునీత  ఉన్నారు.