- మసీదులో ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్
- గత నెల తబ్లిగి జమాత్కు హాజరైనట్టు సమాచారం
లక్నో: ఒకే ఒక్క వ్యక్తి కారణంగా ఉత్తరప్రదేశ్లో 14 గ్రామాలను అధికారులు సీజ్ చేసేశారు. ఓ వ్యక్తి బదౌన్ జిల్లాలోని భవానీపూర్ ఖాలీ ఏరియాలోని ఓ మసీదులో ఉంటున్నాడు. గత నెల ఢిల్లీలో జరిగిన తబ్లిగి జామాత్ సదస్సుకు అతను హాజరయ్యాడు. శనివారం అతడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ జిల్లాల్లోని మొత్తం 14 గ్రామాలను అధికారులు క్వారంటైన్లో పెట్టారు. ‘‘ఒక వ్యక్తికి కరోనా రావడంతో జిల్లా అధికారులు అతడు ఉన్న గ్రామానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న14 గ్రామాలను సీల్ చేసేశారు. మొత్తం 14 గ్రామాలు క్వారంటైన్లో ఉన్నాయి”అని జిల్లా కలెక్టర్ కుమార్ ప్రశాంత్ తెలిపారు. కాగా, సోమవారం ఆగ్రాలో మరో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 134కు చేరింది. ఇందులో 60 మంది తబ్లిగికి చెందిన వారే అని అధికారులు చెప్పారు.