11 రోజుల్లో 1400 కోట్ల మద్యం అమ్మకాలు

11 రోజుల్లో 1400 కోట్ల మద్యం అమ్మకాలు
  • తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

హైదరాబాద్: పండుగ సీజన్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యూత్ ఎక్కువగా వాడే బీర్ల సేల్స్ గత ఏడాది తో పోలిస్తే అమాంతం పెరిగింది. అటు లిక్కర్ సేల్స్ లోనూ దాదాపు ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 రోజుల్లో 1400 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే సేల్స్ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం అవుతోంది. బీర్ల అమ్మకాలు 53శాతం పెరుగగా లిక్కర్(హార్డ్) సేల్ 34 శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. డిపోల నుంచి వైన్స్ లు, మాల్స్, బార్ లకు నిన్న ఒక్క రోజే 178 కోట్ల 18 లక్షల విలువ గల మద్యం చేరిందంటే డిమాండ్ ఏ మేరకు ఉందో అర్థం అవుతుంది. రెండు నెలల క్రితం వరకు బీర్ల అమ్మకాలు ఘోరంగా పడిపోగా.. ఏం జరిగిందో కానీ ఊహించని రీతిలో ఒక్కసారిగా బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. 
ఈనెలలో మద్యం డిపోలకు గాంధీ జయంతి (అక్టోబర్ 2 ), ఇతర సెలవులు పోను 11 రోజుల్లోనే  1400 కోట్ల మధ్యం అమ్మకాలు జరిగాయి. ఈ అక్టోబర్ నెల ముగిసేలోగా సుమారు 3 వేల కోట్లకు పైగానే మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ శాఖ  అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 2020 అక్టోబర్ నెలలో 2,623 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ 31 లక్షల 67 వేల కేసులు, బీర్లు 26 లక్షల 93 వేల కేసుల అమ్మకాలు జరిగాయి. మద్యం అమ్మకాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో ఈ అక్టోబరు నెలలో మద్యం అమ్మకాలు 3వేల కోట్లకు పైగా జరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. మద్యం వల్ల ఆదాయం సగటు 39శాతం మేర పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.