తమిళనాడులో కల్తీ మద్యం ప్రాణాలు తీస్తోంది. ఇటీవలే విల్లుపురం జిల్లా, చెంగల్ పట్టు జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 14 మంది మరణించగా.. పలు ఆస్పత్రుల్లో ఇంకా 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. లేటెస్ట్ గా తంజావూరు జిల్లాలో ఓ బారులో మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఘటన జరిగిన కాసేపటికే స్థానికులు షాపుపై దాడి చేసి ఆందోళనకు దిగారు. దీంతో తంజావూరు కలెక్టర్ దినేష్ ఆలివర్ ఘటనా స్థలానికి వచ్చి చనిపోయిన ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మద్యంలో సైనైడ్ కలవడంతోనే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో మద్యంలో విషం కలిపింది ఎవరా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కలెక్టర్ దినేష్ పొన్రాజ్ ఆలివర్ తెలిపారు.బార్లోని సీసీటీవీ పని చేయడం లేదని, ఆధారాలు సేకరిస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ రావత్ తెలిపారు.