
- సెల్ఫ్ ఐసోలేషన్లోకి 12 మంది
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మర్కజ్లో నిర్వహించిన సమావేశాలపై విచారణ చేస్తున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా తబ్లీగ్ జమాత్ చీఫ్ ఫాం హౌస్, మర్కజ్లో సోదాలు చేసిన పోలీసులకు లక్షణాలు కనిపించడంతో టెస్ట్లు నిర్వహించారని ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. వారితో కాంటాక్ట్లో ఉన్న 12 మంది పోలీసులు సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లారు. ఇప్పుడు ఢిల్లీలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 100 దాటింది. ఆంక్షలు ఉన్నప్పటికీ ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ కేంద్రంగా తబ్లీగ్ జమాత్ సమావేశాలు నిర్వహించిన మౌలానా సాద్పై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. ఈ కేసులో మౌలానాకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన ఫాంహౌస్ తదితర చోట్ల సోదాలు నిర్వహించారు.